గ్రెనెడ్లతో విరుచుకుపడిన ఉగ్రవాదులు: 12 మందికి గాయాలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. బుధవారం ఉగ్రవాదులు గ్రెనెడ్లతో దాడులకు పాల్పడటంతో 12 మంది పౌరులు గాయాలపాలయ్యారు. పుల్వామాలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని అధికారులు తెలిపారు.
పుల్వామాలోని కకపురా చౌక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు. భద్రతా దళాలే లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రెనెడ్లతో దాడులకు పాల్పడ్డారని, అయితే, అది తప్పిపోయి రోడ్డుపై పేలిందని తెలిపారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పారు.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) ఎవరూ కూడా గాయాలపాలు కాలేదని అధికారులు తెలిపారు. కాగా, ఇటీవలే పాక్ సైనికులు, ఉగ్రవాదులు జరిపిన కాల్పులు ముగ్గురు భారత సైనికులు, ముగ్గురు పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత భారత్ ప్రతీకార దాడులు చేసింది. పాకిస్థాన్లోని ఉగ్రవాద ఆయుధ శిబిరాలను లక్ష్యంగా చేసుకుని తేలికపాటి క్షిపణులను ప్రయోగించి ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో 8-10 వరకు పాక్ సైనికులు, ఉగ్రవాదులు హతమైనట్లు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి.