ఘోర రోడ్డు ప్రమాదం : 12 మంది మృతి.. 26 మందికి గాయాలు..
గుజరాత్లోని వడోదరాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పద్రా తాలుకాలోని మహువద్-రణు మార్గంలో టెంపో-ట్రక్కు ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి చెందారు. ఇందులో ఆరుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడవగా.. మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరిలో నలుగురు మహిళలు,ముగ్గురు మైనర్లు,ఒక చిన్నారి ఉన్నారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో టెంపోలో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం.
ఓ పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.పెళ్లికి ముందు నిర్వహించే సాంప్రదాయబద్ద కార్యక్రమాల్లో పాల్గొనడానికి వారంతా సావ్లి తాలుకాలోని తమ బంధువుల ఇంటికి వెళ్లి పద్రా తాలుకాలోని తమ గ్రామాలకు బయలుదేరారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. టెంపోను నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్పై కూడా కేసు నమోదు చేశారు.