ఇక్కడ వెటర్నరి డాక్టర్ ప్రియాంక.. అక్కడ న్యాయ విద్యార్థిని: తుపాకీతో బెదిరించి గ్యాంగ్ రేప్
రాంచీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న వెటరినరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి దారుణ హత్యోదంతం తరహాలోనే జార్ఖండ్ లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ న్యాయ విద్యార్థినిపై 12 మంది యువకులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. తుపాకీతో బెదిరించి, ఈ ఘోర కృత్యానికి వారు ఒడిగట్టారు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన బాధిత విద్యార్థిని ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
#PriyankaReddy: టోల్ గేట్ సీసీటీవీ ఫుటేజీలో చివరిసారిగా కనిపించిన ప్రియాంకా, అక్కడే స్కూటీ పార్క్
తుపాకీతో బెదిరించి..
సంఘటన చోటు చేసుకున్న రోజు సాయంత్రం బాధిత న్యాయ విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి రింగ్ రోడ్డు సమీపంలో కాలి నడకన వెళ్తుండగా..సునీల్ ముండా, కుల్దీప్ అనే యువకులు వారిని అటకాయించారు. తమ వద్ద ఉన్న నాటు తుపాకీతో వారిని బెదిరించారు. దీనితో న్యాయ విద్యార్థిని స్నేహితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలిని చెరబట్టిన వారు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం తమ స్నేహితులకు ఫోన్ చేయగా, వారు కూడా వచ్చి ఆ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డారు.
విషమంగా బాధితురాలి ఆరోగ్యం..
సంఘటనా స్థలం నుంచి పారిపోయిన న్యాయ విద్యార్థిని స్నేహితుడు కంకె పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చాడు. సమాచారాన్ని అందుకున్న వెంటనే రింగ్ రోడ్డు వద్దకు చేరుకున్న పోలీసులు చుట్టు పక్కల గాలించగా.. రోడ్డు పక్కన నిర్జన ప్రదేశంలో అపస్మారక స్థితిలో కనిపించారా విద్యార్థిని. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాధిత విద్యార్థినికి అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
నిందితులను పట్టిచ్చిన ఫోన్ కాల్
బాధితురాలి స్నేహితుడు, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. సెల్ టవర్ సిగ్నళ్ల ఆధారంగా..ప్రధాన నిందితుడు సునీల్ ముండా.. తన స్నేహితులకు ఫోన్ చేసినట్లు గుర్తించారు. ఆ సమయంలో, సంఘటనా స్థలం నుంచి వెళ్లిన ఫోన్ కాల్స్ ఆధారంగా సునీల్ ముండాను అరెస్టు చేశారు. కంకె పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించే సరికి నేరాన్ని అంగీకరించాడు.
ఆ 12 మంది వీరే..
ఈ ఘటనలో సునీల్ ముండాతో పాటు కుల్దీప్ ఒరవాన్, సునీల్ ఒరవాన్, సందీప్ టిర్కీ, అజయ్ ముండా, రాజన్ ఒరవావన్, నవీన్ ఒరవాన్, అమన్ ఒరవాన్, బసంత్ కఛప్, రవి ఒరవాన్, రోహిత్, రిషిలను పోలీసులు అరెస్టు చేశారు. సంఘటన చోటు చేసుకున్న 48 గంటల్లోనే నిందితులందరినీ అరెస్టు చేశామని రాంచీ రూరల్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రిషబ్ కుమార్ ఝా తెలిపారు. సంఘటనా స్థలం నుంచి సునీల్ ముండా తన స్నేహితులకు చేసిన ఫోన్ కాల్ ఆధారంగా ఈ కేసును ఛేదించినట్లు చెప్పారు.