12 మంది ఐటీ అధికారులపై వేటు.. అవినీతి, లైంగిక వేధింపులే కారణం..
ఢిల్లీ : అవినీతి అధికారులపై కేంద్రం కొరడా ఝుళిపించింది. ఒకేసారి 12 మంది ఇన్కం ట్యాక్స్ అధికారులపై వేటు వేసింది. అవినీతి, విధుల్లో నిర్లక్ష్యంతో పాటు మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 12 మంది ఉన్నతాధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కేంద్రం సాగనంపిన అధికారుల్లో చీఫ్ కమిషన్, ప్రిన్సిపల్ కమిషన్, కమిషనర్ స్థాయి అధికారులు ఉండటం విశేషం. ప్రభుత్వం విధుల నుంచి తప్పించిన వారిలో 8మంది అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. జనరల్ ఫైనాన్షియల్ రూల్ 56 ప్రకారం వారితో నిర్బంధ పదవీ విరమణ చేయించనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది.
బెంగాల్లో రాష్ట్ర్రపతి పాలన విధిస్తారా...? గవర్నర్ త్రిపాఠీ, మోడీ, అమిత్ షాలను కలవడం వెనుక అంతర్యం
బలవంతపు వసూళ్లు, లైంగిక వేధింపులు
అవినీతి, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 12మంది ఐటీ అధికారులపై ఏక కాలంలో వేటు వేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రభుత్వం బాధ్యతల నుంచి తొలగించిన వారిలో ఐఆర్ఎస్ 1985 బ్యాచ్కు చెందిన అశోక్ కుమార్ ఒకరు. జాయింట్ కమిషనర్ హోదాలో ఉన్న ఆయన.. ఓ వ్యాపారి నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లు తేలడంతో 1999 నుంచి 2014 వరకు ఆయనను సస్పెండ్ చేశారు. ఆధ్యాత్మిక గురువు చంద్రస్వామికి అశోక్ సాయం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడారన్న ఆరోపణలపై 1989 బ్యాచ్కు చెందిన ఎస్ కే శ్రీవాస్తవపై ఆర్థిక శాఖ వేటు పడింది. కమిషనర్ స్థాయి మహిళా అధికారిణితో పాటు మరో మహిళను సైతం వేధించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. శ్రీవాస్తవపై డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ పదేళ్లుగా కొనసాగుతుండగా... క్యాట్, హైకోర్టు, సుప్రీంకోర్టులో ఆయన 75కు పైగా పిటీషన్లు దాఖలు చేశారు. ప్రమోషన్ల విషయంలో శ్రీవాస్తవ తన బ్యాచ్మేట్లతో పాటు జూనియర్ల యూపీఎస్ఈని ఆశ్రయించారు. ఆయన కారణంగానే మూడు బ్యాచ్లకు చెందిన అధికారుల ప్రమోషన్లు గత మూడేళ్లుగా నిలిచిపోయాయి.
అవినీతి, అక్రమాలు
అధికారం దుర్వినియోగం, అక్రమమార్గాల్లో రూ.3.17 కోట్లు కూడబెట్టిన ఐఆర్ఎస్ అధికారి హోమీ రాజ్వంశ్ను ఉద్యోగం నుంచి వైదొలగాలని ఆదేశించింది. అక్రమాలకు సంబంధించి ఆయనను పోలీసులు ఆయనను అరెస్ట్ చేయగా, అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. అయితే టెక్నికల్ రీజన్స్ చూపుతూ హోమీ రాజ్ వంశ్ దశాబ్దకాలంగా తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నారు. వీరితోపాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అజయ్ కుమార్, అలోక్ మిత్రా, చందర్ భార్తి, అందాసు రవీందర్, వివేక్ బాత్రా, శ్వేతబ్ సుమన్, రాజ్ భార్గవ, రాజేంద్రప్రసాద్ తదితరులను బాధ్యతల నుంచి తప్పినట్లు అధికారవర్గాలు తెలిపాయి. వీరందరితో నిర్బంధ పదవీ విరమణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
నిర్బంధ పదవీ విరమణ
నిర్బంధ పదవీ విరమణ చేయించాల్సిన అధికారులను గుర్తించాల్సిందిగా గత కొంతకాలంగా కేబినెట్ సెక్రటేరియట్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లు తమ అధికారులకు మౌకిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ 1972 చట్టంలోని 56 (జే) నిబంధన ప్రకారం అధికారి వయసు 50 లేదా 55 ఏళ్లు పూర్తైన తర్వాత లేదా 30 ఏళ్ల సర్వీసు అనంతరం అతని పనితీరును సమీక్షించేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంది. పనిచేయని అధికారులపై వేటు వేసేందుకు ఉద్దేశించిన ఈ విధానాన్ని 2014 మోడీ తొలిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే పునరుద్ధరించారు. ఈ చట్టం కింద ఇటీవల కాలంలో ఐఏఎస్లైన ఎంఎన్ విజయ్ కుమార్, కె. నరసింహతో పాటు ఐపీఎస్లు మయాంక్ షీల్ చోహాన్, రాజ్ కుమార్ దేవాంగన్లపై వేటు పడింది.