ఘోరం: నెల రోజులపాటు బాలికపై కజిన్స్ గ్యాంగ్రేప్
ఆగ్రా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి 12ఏళ్ల బాలికపై ఆమె కజిన్స్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను బెదిరింపులకు గురిచేసి ఈ ఘాతుకాన్ని నెలరోజులపాటు కొనసాగించారు.
వివరాల్లోకి వెళితే.. బాలిక తండ్రి రిహాబిలిటేషన్ కేంద్రంలో ఉండగా, ఆమె తల్లి వేరే ఊరికి వెళ్లింది. తన తల్లికి అనారోగ్యంగా ఉండటంతో బాలిక తల్లి బాలికను ఆమె పిన్ని దగ్గర ఉంచేసి వెళ్లింది. దీంతో ఇంట్లో బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఇద్దరు కజిన్స్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.
ఇలా నెల రోజులపాటు ఆమెపై ఈ దారుణాన్ని కొనసాగించారు ఆమె కజిన్స్ అవినాశ్, నిఖిల్. ఆ తర్వాత బాధిత బాలిక తన తల్లి వద్దకు వెళ్లింది. తనకు నొప్పిగా ఉంటోందని తెలిపి, తనపై జరిగిన అఘాయిత్యాన్ని గురించి తల్లికి వివరించింది. దీంతో కూతురును తీసుకుని ఆమె కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసింది.
బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్న ఎస్ఎస్పీ స్థానిక పోలీసులను నిందితులపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో నిందితులిద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అవినాశ్ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు నిఖిల్ కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇది ఇలా ఉండగా, సహగంజ్ ప్రాంతంలో ఓ నాలుగేళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. ఆమెను అత్యాచారం చేసిన దుండగులు, హత్య చేసివుంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం జరిగిన సంతకు మరో నలుగురు చిన్నారులతో వెళ్లిన తమ కూతురు మళ్లీ తిరిగిరాలేదని మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.