12ఏళ్ల వివాహితపై రేప్: నెలపాటు గదిలో బంధించి చిత్రహింసలు
ధర్మపురి: తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే ఆ బాలికకు వివాహం జరిగింది. కాగా, తన భర్తతో కాపురానికి వెళ్లడం లేదని ఆ 12ఏళ్ల బాలికపై అత్తింటివారు చిత్ర హింసలకు గురి చేశారు. అత్యాచారం చేసి, ఆహారం కూడా పెట్టకుండా నెలరోజులపాటు ఆమెను ఓ గదిలో బంధించారు.
సోమవారం ఉదయం ధర్మపురి చైల్ హెల్ప్లైన్ సిబ్బంది.. పప్పిరెడ్డిపట్టి తాలూకాలోని ఇరులపట్టి గ్రామానికి చెందిన ఆ బాలికను కాపాడారు. ఇరుపొరుగువారు ఇచ్చిన సమాచారం మేరకు ఆ బాలికను కాపాడగలిగామని జిల్లా కలెక్టర్ ఎస్ షైన్ థామస్ తెలిపారు. ఆ బాలికను అత్తింటివారు చిత్రహింసలకు గురి చేశారని చెప్పారు.
22ఏళ్ల యువకుడితో తనకు వివాహం జరిపించారని బాధిత బాలిక తమకు తెలిపినట్లు కలెక్టర్ తెలిపారు. సంతోష్ అనే యువకుడితో ఆమెకు వివాహమైందని చెప్పారు. కాగా, బాధితురాలి అక్క అప్పుస్ లక్ష్మీ(20) నివాసం ఉండే ప్రాంతంలోనే సంతోష్ కూడా ఉంటున్నాడు.
సంతోష్తో ఉన్న తన వివాహేతర సంబంధాన్ని తెంచుకోవడానికి అప్పుస్ లక్ష్మీ.. తన చెల్లెలిని(బాధితురాలు) అతనికిచ్చి వివాహం చేసింది. కాగా, చిత్రహింసల విషయం తెలుసుకున్న చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది ఆమె ఉన్న ఇంటికి చేరుకుని తాళాలు పగలగొట్టి ఆమెను కాపాడారు.
అత్తింటివారు ఆమెకు నెలరోజులుగా ఆహారం కూడా పెట్టకుండా తీవ్రంగా కొట్టారని సిబ్బంది తెలిపారు. అంతేగాక, ఆమెపై అత్యాచారం చేశారని చెప్పారు. ఆమె అక్కడ్నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. ఆమె బట్టలూడదీసి ఇంట్లోనే బంధించారని తెలిపారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం ధర్మపురి మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు.