ఆకతాయి పిల్ల.. ఆర్మీని ఏ రేంజ్ లో హడలెత్తించిందంటే..!
న్యూఢిల్లీ : యూరీ ఉగ్ర ఘటన తర్వాత దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. ఏమాత్రం అనుమానస్పద వ్యక్తుల వ్యవహారం తమ ద్రుష్టికి వచ్చినా.. వెంటనే రంగంలోకి దిగి ఆయా ప్రాంతాలను జల్లెడ పట్టేస్తున్నాయి. ఇంతటి సీరియస్ పరిణామాల మధ్య.. ఆకతాయి వేశాలతో సైనికులకే ఝలక్ ఇచ్చేంత పనిచేసింది ఓ పన్నెండేళ్ల బాలిక.
నేవి ముంబైలోని ఉరాన్ నౌకాశ్రయం సమీపంలో కొంతమంది వ్యక్తులు అనుమానస్పద తిరుగుతుండడం గమనించానని సదరు బాలిక చెప్పడంతో.. ఆగమేఘాల మీద ఆ ప్రాంతంలో వాలిపోయిన నేవి, కోస్ట్ గార్డ్, ఎన్ఏజీ భద్రతా బలగాలు ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పట్టారు. ఎక్కడా అనుమానస్పద కదలికల వ్యవహారం ఉన్నట్టు తేలకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఆ తర్వాత తెలిసిన అసలు విషయమేంటంటే.. ఇదంతా ఆ బాలిక ఆకతాయికి చేసిన పని. చిన్నపిల్ల కావడం.. అందునా మొదటి తప్పు కాబట్టి జవాన్లు బాలికను కాస్తంతా మందలించారంతే. అనంతరం బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. సున్నితమైన విషయాల్లో తప్పుదోవ పట్టించడం వల్ల చోటు చేసుకునే అనర్థాలను, విపత్కర పరిస్థితులను ఆ చిన్నారికి విడమరిచి చెప్పారు. కాగా, ఇలాంటి ఆకతాయి పనుల వల్ల రక్షణ దళాల సమయం వృధా అవుతుందని సైనికాధికారి ఒకరు వాపోయారు.