430కిలోల బంగారం,12లక్షల కొత్త నోట్లు: ఐటీకి చిక్కిన అవినీతి తిమింగలం
తాజా దాడుల్లో ఏకంగా రూ.120కోట్ల విలువైన 430కేజీల బంగారంతో పాటు రూ.2.48 కోట్ల పాత నోట్లు, రూ.12లక్షల కొత్త నోట్లు, 80కేజీల వెండి, 15కేజీల బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి.
న్యూఢిల్లీ: ఐటీ వలలో అతిపెద్ద అవినీతి తిమింగలం చిక్కింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత వరుసగా జరుగుతున్న ఐటీ దాడుల్లో భారీ మొత్తంలో బంగారం, నగదు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన అన్ని దాడుల కన్నా తాజాగా నోయిడాలో ఐటీ అధికారులు నిర్వహించిన దాడుల్లో భారీ మొత్తంలో బంగారంతో పాటు నగదు పట్టుబడింది.
శ్రీ లాల్ మహల్ కమోడిటీస్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన యజమానుల కార్యాలయాలు, ఇళ్లపై ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ లక్నో విభాగం ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు.
భారీగా పట్టుబడ్డ బంగారం, నగదు:
తాజా దాడుల్లో ఏకంగా రూ.120కోట్ల విలువైన 430కేజీల బంగారంతో పాటు రూ.2.48 కోట్ల పాత నోట్లు, రూ.12లక్షల కొత్త నోట్లు, 80కేజీల వెండి, 15కేజీల బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి. ప్రత్యేక ఆర్థిక నిబంధనల ప్రకారం డ్యూటీ ఫ్రీ పద్దతిలో దిగుమతి చేసుకున్న బంగారాన్ని అక్రమంగా కూడబెట్టినట్టుగా తెలుస్తోంది.
ఇదే కంపెనీ నుంచి భారీ మొత్తంలో ఆన్ లైన్ నగదు లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, అనారోగ్య కారణాలు సాకుగా చూపుతూ.. అధికారుల ప్రశ్నలను కంపెనీ డైరెక్టర్లు దాటవేస్తున్నారని ఐటీ అధికారులు చెబుతున్నారు.