సుప్రీం చెప్పినా టిక్ టాక్ భూతం పోలే!..12 కోట్ల ఫోన్లలో ఇంకా టిక్కు టక్కుమంటూనే ఉంది..! మరెలా?
యూత్ను ఈ మధ్యకాలంలో విపరీతంగా అట్రాక్ట్ చేసిన సోషల్ నెట్ వర్కింగ్ యాప్ టిక్ టాక్. ఈ యాప్ దుర్వినియోగం అవుతోందంటూ విమర్శలు వెల్లువెత్తడంతో కోర్టులు సైతం ఈ అంశంపై స్పందించాయి. తాజాగా సుప్రీంకోర్టు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి టిక్ టాక్ను తొలగించాలని ఆదేశించింది. అయితే కోర్టు నిర్ణయంతో టిక్ టాక్ భూతం పూర్తిగా వదిలిందనుకుంటే పొరపాటే.
పబ్జీ గేమ్ కు మరో బాలుడు బలి...తల్లిదండ్రులు ఆడొద్దన్నారని ఆత్మహత్య
యాప్ స్టోర్ నుంచి తొలగింపు
టిక్ టాక్ వల్ల ఆశ్లీలత పెరిగిపోయిందని, విద్వేషాలు రెచ్చగొట్టేలా వీడియోలు ఉంటున్నాయని మద్రాస్ హైకోర్టు దానిపై నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా ఈ యాప్ను నిషేధించాలని కేంద్రాన్ని కోరింది. సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు కావడంతో దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గూగుల్, యాపిల్ కంపెనీలు తమ స్టోర్ నుంచి టిక్ టాక్ యాప్ను రిమూవ్ చేయాలని ఆదేశించింది. దీంతో గూగుల్, యాపిల్ కంపెనీలు కోర్టు ఉత్తర్వులను పాటిస్తూ వాటిని తొలగించాయి. దీంతో ఇకపై కొత్త యూజర్లు టిక్ టాక్ను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది.
12కోట్ల యూజర్లు
గూగుల్, యాపిల్ స్టోర్లలో అందుబాటులో లేకపోయినా టిక్ టాక్ భూతం ఇప్పటికీ 12కోట్ల స్మార్ట్ ఫోన్లలో భద్రంగా ఉంది. తమకు భారత్లో 120 మిలియన్ల యూజర్లు ఉన్నట్లు టిక్ టాక్ను రూపొందించిన బైటెడెన్స్ టెక్నాలజీ ప్రకటించింది. సుప్రీం ఆదేశాల మేరకు టిక్ టాక్ ప్రస్తుతం యాప్ స్టోర్లో అందుబాటులో లేకపోయినా ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్న యూజర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా యాప్ను వాడుకోవచ్చు. అంతేకాక ఏపీకే ఫైల్ రూపంలో షేర్ ఇట్ తదితర యాప్ల ద్వారా వాటిని షేర్ చేసుకునే అవాకాశముంది. మరి అలాంటప్పుడు స్టోర్ నుంచి తొలగించినంత మాత్రన కలిగే ప్రయోజనం ఏమీలేదన్నది నిపుణుల అభిప్రాయం.
యూజర్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు
సుప్రీం ఆదేశాలపై బైటెడెన్స్ కంపెనీ స్పందించింది. భారత్లో ప్రస్తుతం ఉన్న 12 కోట్ల టిక్ టాక్ యూజర్లుకు సేవలు కొనసాగిస్తామని చెప్పింది. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని చెప్పింది. యాప్ టర్మ్స్ అండ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఫాలో అవ్వని 60 లక్షల వీడియోలను ఇప్పటి వరకు తొలగించినట్లు బైటెడెన్స్ స్పష్టం చేసింది.