చర్చలు 120 శాతం ఫెయిల్.. 'ఉపా' చట్టాన్ని ప్రయోగిస్తారా? బ్రోకర్లతో చర్చలకు వెళ్లం.. రైతుల సంఘాల ఫైర్...
చర్చలు మళ్లీ విఫలమయ్యాయి... వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు పట్టుబట్టడం,కేంద్రం ససేమిరా అనడం... మొత్తంగా ఏ పురోగతి లేకుండానే మరోసారి చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దీంతో ఇప్పటికే 50 రోజులు దాటిన రైతుల ఆందోళనలు మరికొంత కాలం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 19న రైతులతో కేంద్రం మరోసారి చర్చలు జరపనున్నప్పటికీ... అప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం లేకపోలేదు. తాజాగా ముగిసిన చర్చల అనంతరం రైతు నేత డా.దర్శన్ పాల్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆ సవరణలు తొలగించమన్నాం : దర్శన్ పాల్
'ఇది 120 శాతం ఫెయిల్యూర్. నిత్యావసర సరకుల(సవరణ) చట్టాన్ని (ది ఎసెన్షియల్ కమోడిటీస్-అమెండమెంట్ 2020) రద్దు చేయడం బదులు... కేంద్రం దానికి చేసిన సవరణలను తొలగించమని కోరాం. కానీ వ్యవసాయ శాఖ మంత్రి మా ప్రతిపాదనపై స్పందించలేదు.' అని దర్శన్ పాల్ పేర్కొన్నారు. తాజా చర్చలతోనూ ప్రతిష్ఠంభనకు తెరపడకపోవడంతో ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా ట్రాక్టర్ ర్యాలీకి సిద్దమవుతున్నామని చెప్పారు. ట్రాక్టర్ ర్యాలీని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించి తీరుతామన్నారు.
ఉపా చట్టాలు మోపుతారా...?
తాజా సమావేశంలో రైతులు మరో అంశాన్ని కూడా లేవనెత్తారు. తమ ఉద్యమానికి మద్దతునిస్తున్నవారిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడం,వారిపై ఉపా చట్టాలను ప్రయోగించడం సరికాదన్నారు. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వాలే చేయిస్తున్నాయని,తమకే సంబంధం లేదని కేంద్రం ఇదివరకే స్పష్టం చేసింది. అయినప్పటికీ రైతుల విజ్ఞప్తిని పరిశీలిస్తామని కేంద్రం పేర్కొంది. వ్యవసాయ చట్టాలపై నెలకొన్న ప్రతిష్ఠంభనకు పరిష్కారం చూపేలా సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీని రైతు సంఘాలు ఇదివరకే తిరస్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రంతో చర్చల్లో పాల్గొన్న 40 రైతు సంఘాలు మరోసారి ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. తాము కేంద్రంతో చర్చలు జరుపుతామని.. బ్రోకర్లతో కాదని రైతు సంఘాల నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుప్రీం ఏర్పాటు చేసిన కమిటీలో ఉన్నవారు ఇప్పటికే ఆ చట్టాలకు మద్దతు పలికారని గుర్తుచేశారు.
తదుపరి చర్చలపై ఆశాభావం...
మరికొంతమంది రైతులు ఈ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చర్చల అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ మాట్లాడుతూ... తదుపరి చర్చల్లో సమస్య పరిష్కారమవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంతో మాత్రమే చర్చలు జరుపుతామని,సుప్రీం కమిటీతో చర్చలకు వెళ్లమని రైతులు చెప్పడం తమకేమీ సమస్య కాదన్నారు. సుప్రీం కమిటీ తమను పిలిచినప్పుడు చర్చలకు హాజరువుతామని స్పష్టం చేశారు.