కరోనా విలయం: 121 మంది చిన్నారులకు వైరస్, 12 ఏళ్లలోపు చిన్నారులే.. 2 వేలు దాటిన పాజిటివ్..
తమిళనాడులో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం 121 పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం సంఖ్య 2 వేల 58కి చేరింది. ఇందులో 1392 మంది పురుషులు కాగా.. 666 మంది మహిళలు ఉన్నారు. గత 24 గంటల్లో రాజధాని చెన్నైలో 103 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సిటీలో మొత్తం కేసుల సంఖ్య 673కి చేరింది.
27 మంది డిశ్చార్జ్..
కరోనా వైరస్ సోకిన 1128 మంది కోలుకున్నారని తమిళనాడు వైద్యాధికారులు తెలిపారు. వీరిలో మంగళవారం 27 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. ఒకరు చనిపోవడంతో మృతుల సంఖ్య 25కి చేరింది. కరోనా వైరస్ సోకిన వారిలో 121 మంది చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వీరంతా 12 ఏళ్ల లోపు వారు అని అధికారులు వివరించారు.
ఒక్క జిల్లాలోనే..
తమిళనాడులో కృష్ణగిరి జిల్లాలో గత 28 రోజుల నుంచి ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. అందుకే ఈ ఒక్క జిల్లానే గ్రీన్ జోన్ పరిధిలో ఉంది. ఆరెంజ్ జోన్లో 7 జిల్లాలు ఉండగా.. ఇక్కడ 15 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మిగతా 29 జిల్లాలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి. ఈ జిల్లాలో 24 గంటల్లో 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Recommended Video
902 యాక్టివ్ కేసులు
ఇప్పటివరకు 1,01,874 మంది రక్త నమూనాలను పరీక్షల కోసం పంపించామని అధికారులు పేర్కొన్నారు. 30 ప్రభుత్వం, 11 ప్రైవేట్ ల్యాబులలో పరీక్షలు చేస్తున్నారు. 2058 మందికి వైరస్ ఉందని.. 97 వేల 908 మందికి నెగిటివ్ వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. మరో 1908 శాంపిల్స్ పరీక్షిస్తున్నామని.. 8685 మందికి సంబంధించి మళ్లీ పరీక్షలు చేస్తున్నామని వివరించారు. 1128 మందికి వైరస్ తగ్గడంతో డిశ్చార్జ్ చేశామని.. రాష్ట్రంలో 902 మందికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో క్రమంగా పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.