127 మందిపై సామూహిక అత్యాచారం, లూటీలు
డాకర్: ఇండ్లలోని వస్తువులు లూటీ చేసి చిన్నా పెద్ద అని తేడా లేకుండా వరుసగా అత్యాచారం చేస్తుండటంతో తూర్పు కాంగోలోని మహిళలు హడలిపోతున్నారు. ఎప్పుడు వచ్చి మీద పడుతారో అని రాత్రి పగలు నిద్రహారాలు మాని జాగారం చేస్తున్నారు.
ఆర్మీ మిలిషియా దురాగతాలు రోజురోజుకు పెరిగిపోవడంతో ఆ ప్రాంతంలోని మహిళలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలను గురువారం డాక్టర్స్ విత్ అవుట్ బోర్డర్స్ అనే స్వచ్చంద సంస్థ వెలుగులోకి తీసుకు వచ్చింది.
మే 1వ తేది జరిగిన ఈ దారుణ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తూర్పు కాంగోలోని దక్షిణ కీవ్ ప్రావెన్స్ లో ఆర్మీ మిలిషియా సభ్యులు ఇండ్ల మీద దాడులు చేశారు. తరువాత ఇండ్లలోని విలువైన వస్తువులు లూటీ చేశారు. మహిళలను బయటకు లాగేశారు.
చిన్నా పెద్ద తేడా లేకుండ వరసపెట్టి గ్యాంగ్ రేప్ లు చేశారు. సుమారు 127 మంది మీద అత్యాచారం చేశారు. అత్యాచారానికి గురైన వారిలో 14 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఉన్నారని స్వచ్చంద సంస్థ వెల్లడించింది.
అత్యాచారాలకు గురైన వారు ఫిర్యాదులు చెయ్యడానికి వెనకడుగు వేస్తున్నారని, అయితే వైద్యం అందించాలని ఎదురు చూస్తున్నారని అంటున్నారు. అందరికి వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. గత 20 సంవత్సరాల నుండి ఆర్మీ మిలిషియా సభ్యుల దురాగతాలకు అడ్డు అదుపు లేకుండ పోతున్నది.