ఎయిర్పోర్టు ఉద్యోగులకు ఆల్కహాల్ టెస్టులు..ఎంత మందిపై వేటుపడిందో తెలుసా..?
న్యూఢిల్లీ: విమానాశ్రయాల్లో పనిచేసే ఉద్యోగులు, ఎయిర్లైన్స్ ఉద్యోగులు కలిపి మొత్తంగా 13 మంది ఆల్కహాల్ టెస్టులో విఫలమయ్యారు. సెప్టెంబర్ 16 నుంచి నిర్వహించిన టెస్టుల్లో మొత్తం 13 మంది ఉద్యోగులు బుక్ అయ్యారు. వీరిని మూడునెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు. వేటుపడిన వారిలో ఏడుమంది ఇండిగో ఉద్యోగులు, గోఎయిర్ స్పైస్ జెట్ ఎయిర్లైన్స్కు చెందిన ఒక్కో ఉద్యోగి ఉన్నట్లు తెలిపారు.
బ్రీత్ అనలైజర్ టెస్టు నిర్వహించగా 13 మంది విఫలమైనట్లు అధికారులు తెలిపారు. ఇది కేవలం వాలంటరీ ఫేజ్లోనే జరిగిన టెస్టులని నవంబర్ నుంచి పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించి ఆల్కహాల్ టెస్టులో ఫెయిల్ అయిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీసీఏ అధికారులు తెలిపారు. ఇక వీరితో పాటు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక సీనియర్ అసిస్టెంట్, మరో మేనేజర్ కూడా ఆల్కహాల్ టెస్టుల్లో విఫలమైనట్లు అధికారులు వెల్లడించారు.
ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఏరో బ్రిడ్జ్ ఆపరేటర్గా ఉన్న వ్యక్తి అక్టోబర్ 21న నిర్వహించిన టెస్టుల్లో విఫలం అవగా... ముంబై విమానాశ్రయంలోని సీనియర్ ఎయిర్పోర్ట్ ఎలక్ట్రీషియన్ కూడా టెస్టులో ఫెయిల్ అయినట్లు అధికారులు తెలిపారు.
ఉద్యోగులు మద్యం సేవించి విధుల్లోకి రాకూడదని పేర్కొంటూ అన్ని విమానాశ్రయాల్లో ఆల్కహాల్ టెస్టులు నిర్వహించాలని సెప్టెంబర్ 16న ఏవియేషన్ సంస్థ ఆదేశాలు జారీ చేసింది. ఏటీసీ సిబ్బంది, గ్రౌండ్ సిబ్బంది, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ చూసుకునేవారందరికీ ఆల్కహాల్ టెస్టులు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
ఎవరైనా పాజిటివ్గా తేలినా, టెస్టులకు అంగీకరించకపోయినా, లేదా విమానాశ్రయం పరిసరాలు వీడి వెళ్లిపోయినా అట్టివారిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఇక విమానాశ్రయంలో పనిచేసే ఉద్యోగులను కనీసం 10శాతం మందికైనా అప్పుడప్పుడు ఆల్కహాల్ టెస్టులు నిర్వహించాలని ఏవియేషన్ రెగ్యులేటర్ సంస్థ ఆదేశాలు జారీ చేసింది.