గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం, 13 మంది మృతి, కూలిపనుల కోసం వెళ్లి పైలోకాలకు !
గుజరాత్ లోని ఖోడా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో 9 మందికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.
అహ్మదాబాద్: గుజరాత్ లోని ఖోడా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో 9 మందికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. గుజరాత్ లోని అహమ్మదాబాద్-ఇండోర్ జాతీయ రహదారిలో మంగళవారం వేకువ జామున ఈ ప్రమాదం జరిగింది.
మధ్యప్రదేశ్ లోని సేజేబాడ గ్రామంలో నివాసం ఉంటున్నవారు కూలి పనులు చెయ్యడానికి గుజరాత్ వెళ్లారు. మంగళవారం వేకువ జామున అందరూ తుపాన్ వాహనం (జీపు)లో బయలుదేరారు. మార్గం మధ్యలో కేదల్ జిల్లాలోని కతలాల్ ప్రాంతంలో తుపాన్ జీపు అదుపుతప్పింది.
వేగంగా వెళ్లిన తుపాన్ జీపు ముందు వెలుతున్న ట్రక్ ను ఢీకొనింది. ఈ ప్రమాదంలో జీపు డ్రైవర్ తో సహ 13 మంది దుర్మరణం చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రగాయాలైన 9 మందిని ఆసుపత్రికి తరలించారు. అతి వేగంగా జీపు నడపడం వలనే ప్రమాదం జరిగిందని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.