సీఎం సెక్యూరిటీ సిబ్బందిలో 13 మందికి కరోనా పాజిటివ్....
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సీఎంవో కార్యాలయంలో కరోనా కలకలం రేపుతోంది. కొద్దిరోజుల క్రితమే ఇద్దరు సిబ్బంది కరోనా బారిన పడగా... తాజాగా మరో 13 మంది సిబ్బందికి కరోనా సోకింది. ఇందులో 12 మంది భద్రతా సిబ్బంది కాగా... ఒకరు ముఖ్యమంత్రి కారు డ్రైవర్ కావడం గమనార్హం. కరోనా కలకలం నేపథ్యంలో సీఎంవో కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటివరకూ హిమాచల్ ప్రదేశ్లో మొత్తం 4208 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 2835 మంది కోలుకుని డిశ్చార్జి అవగా... 17 మంది మరణించారు. ప్రస్తుతం 1300 పైచిలుకు యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో సోమవారం నాటికి 1,80,357 కరోనా టెస్టులు చేయగా ఇందులో 1,76,001 మందికి నెగటివ్గా తేలింది. మరో 182 శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉంది.
సోమవారం (అగస్టు 17) నాటికి నమోదైన కేసుల్లో... బిలాస్పూర్ జిల్లాలో 182,చంబా జిల్లాలో 295,హమీర్పూర్లో 414,కంగ్రా జిల్లాలో 616,కిన్నౌర్ జిల్లాలో 59,కుల్లు జిల్లాలో 227 కేసులు,లహౌల్ స్పితి జిల్లాలో 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 55,079 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా... 876 మంది మరణించారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 27,02,,743కి చేరింది. ప్రస్తుతం 6,73,166 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ 19,77,780 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇక మొత్తం మృతుల సంఖ్య 51,797 కి చేరింది.