షాకింగ్ : ఏనుగు ఘటన మరవకముందే.. 13 కోతుల మృతి.. ఏం జరిగి ఉంటుంది?
ఇటీవల కేరళలోని పాలక్కడ్ జిల్లాలో గర్భిణీ ఏనుగు మృతి దేశవ్యాప్తంగా ప్రతీ ఒక్కరినీ కదిలించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన ఇంకా మరవకముందే అసోంలో ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని కచార్ జిల్లాలో ఉన్న కరీంగంజ్లో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్(PHE) ప్రాజెక్టు పరిధిలోని ఓ వాటర్ ట్యాంకులో 13 కోతులు చనిపోయి కనిపించాయి.
కోతులకు ఎవరో విషం పెట్టడం వల్లే మృతి చెంది ఉంటాయని స్థానికులు అనుమానిస్తున్నారు. కోతుల మృతి విషయాన్ని గమనించిన వెంటనే వారు పోలీసులు,అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు ట్యాంకులో నుంచి కోతుల కళేబరాలను బయటకు తీసి పోస్టుమార్టమ్కు తరలించారు.
కరీంగంజ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్(DFO) జల్నూర్ అలీ మాట్లాడుతూ.. ఇది హృదాయ విదారకమైన సంఘటన అన్నారు. దీనిపై విచారణ జరిపిస్తున్నామని చెప్పారు. కోతుల మృతికి ఎవరైనా బాధ్యులుగా తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్థానికులు మాట్లాడుతూ.. కోతులకు విషం పెట్టి ఉంటారన్న అనుమానం కలుగుతోందన్నారు. విష ప్రభావంతో నొప్పికి తాళలేక.. నీళ్లు తాగేందుకు అవి ట్యాంకులో దిగి ఉంటాయని చెబుతున్నారు. దీనిపై దర్యాప్తు జరిగితే తప్ప నిజానిజాలు తేలేలా లేవు.
Recommended Video
కాగా,ఇటీవల కేరళలోని పాలక్కడ్ జిల్లాలో ఓ గర్భిణీ ఏనుగు బెల్లం పూసిన నాటు బాంబు తిని ప్రాణాలు వదిలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఉద్దేశపూర్వకంగానే ఏనుగుకు ప్రాణ హాని తలపెట్టారా.. లేక అడవి పందుల బెడద నుంచి పంటలను కాపాడుకునేందుకు పెట్టిన నాటు బాంబును ఏనుగు తిన్నదా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.