గుప్త నిధి కోసం చిన్నారి నర బలి: చేతి వేళ్లు కోసి రక్త తర్పణం
బెంగుళూరు: గుప్తనిధుల కోసం 5ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెట్టి హతమార్చిన సంఘటన కర్ణాటక రాష్ట్రం కొప్పళ జిల్లాలో చోటు చేసుకుంది. జనవరి 26న ఆ రాష్ట్రంలోని హోసళ్లి గ్రామంలో గాయత్రి అనే బాలిక అదృశ్యంపై నమోదయిన కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు ఈ దారణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ కేసులో మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. కొప్పళ జిల్లా ఎస్పీ పి.రాజా తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హోసపేటకు చెందిన శాంతిలాల్కు హొసళ్లిలో ఉన్న తోటలో మహేందర్ రెడ్డి, జయమ్మలు పనిచేస్తున్నారు. ఆ తోటలో రూ. 18 కోట్లు విలువచేసే గుప్తనిధులు ఉన్నాయని హగరి బొమ్మనహళ్లికి చెందిన మంత్రగాడు బసయ్యస్వామి చెప్పడంతో వారు నమ్మారు.
ఆ నిధిని ఎలాగైన దక్కించుకోడవంపై వారు కేరళకు చెందిన మరో మంత్రగాడిని సంప్రదించడంతో బాలికను బలి ఇవ్వాలని సలహా ఇచ్చాడు. దీంతో గ్రామంలోని ఓ హోటల్ యజమాని శరణబసప్ప కుమార్తె గాయత్రిని గత జనవరి 26న అదే గ్రామానికి చెందిన బసవరాజ్ అనే వ్యక్తి ద్వారా కిడ్నాప్ చేయించారు. బాలిక వయసు 5 సంవత్సరాలు.
బాలిక కనిపించకపోవడంతో రెండు రోజుల తర్వాత 28న మునిరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ బాలికను మహేందర్ రెడ్డి తాను పనిచేసే తోటలోని ఇంట్లో బందీగా ఉంచాడు. కేరళ మంత్రగాడి నేతృత్వంలో ప్రతి రోజూ క్షుద్ర పూజలు నిర్వహించే వారు.
ఆ సమయంలో పాపను చిత్రహింసలు పట్టేవారు. ఫిబ్రవరి 3న పౌర్ణమి సందర్భంగా పూజ కోసం బాలిక చేతి వేళ్లు కోసి రక్త తర్పణం చేశారు. అప్పటికే సరైన ఆహారం లేకపోవడం, చికిత్స కూడా అందకపోవడంతో బాలిక మృతి చెందింది.
ఆందోళనకు గురైన నిందితులు మృతదేహాన్ని అదే గ్రామంలో తమకు వ్యతిరేకంగా ఉండే అనిత అనే మహిళ నిర్మిస్తున్న ఇంటి పైఅంతస్తులోని మరుగుదొడ్డిలో పడేశారు. ఫిబ్రవరి 4న బాలిక మృతదేహాన్ని గుర్తించడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
బాలిక ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలిస్తుండగా, వారితో పాటే నిందితులు తిరగసాగారు. ఆ సమయంలో శివప్ప అనే వ్యక్తి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో బాలిక బంధువులు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పరారీలో ఉన్న కేరళ మాంత్రికుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.