జగన్ సహా 13 మంది సీమాంద్ర ఎంపీల రిజైన్లకు నో
న్యూఢిల్లీ: సీమాంధ్రకు చెందిన 13 మంది లోకసభ సభ్యుల రాజీనామాలను లోకసభ స్పీకర్ మీరా కుమార్ శుక్రవారం తిరస్కరించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వారు స్పీకర్కు రాజీనామా లేఖలను సమర్పించారు. తమ రాజీనామాలను ఆమోదించాలని గత కొద్ది రోజులుగా సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ఒత్తిడి తెస్తున్నారు. స్వయంగా స్పీకర్ను కొంత మంది పార్లమెంటు సభ్యులు కలిశారు కూడా.
రాజీనామాలను తిరస్కరించినట్లు స్పీకర్ కార్యాలయం నుంచి ఎంపీలకు ఫోన్ చేసి చెప్పారు. పార్లమెంటు సభ్యుల నుంచి రాజీనామాలపై స్పీకర్ వివరణ అడిగారు. ఏడుగురు ఎంపీలు స్పీకర్ను కలిసి వివరణ ఇచ్చారు. రెండు నెలల క్రితం పార్లమెంటు సభ్యులు తమ రాజీనామా లేఖలను స్పీకర్కు అందజేశారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన వైయస్ జగన్, మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజీనామాలు కూడా తిరస్కరణకు గురయ్యాయి. తెలుగుదేశం పార్టీ నుంచి కొనకళ్ల మాత్రమే రాజీనామా లేఖ ఇచ్చారు. ఆయన రాజీనామా లేఖ కూడా తిరస్కరణకు గురైంది.
కాంగ్రెసు పార్టీకి చెందిన లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, కనుమూరి బాపిరాజు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సాయిప్రతాప్, ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్, సబ్బం హరి, ఎస్పీవై రెడ్డి, రాయపాటి సాంబశివరావు రాజీనామాలను స్పీకర్ తిరస్కరించారు. వీరిలో ఎస్పీవై రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.
రాజీనామాను తిరస్కరించినట్లు తనకు ఫోన్ చేసి చెప్పారని హర్షకుమార్ ఓ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. కారణం ఏమిటో చెప్పలేదని అన్నారు. తిరస్కరిస్తున్నట్లు రాతపూర్వకంగా ఇస్తామని, దాన్ని ఫాక్స్ చేస్తామని చెప్పారని ఆయన అన్నారు.