మైనర్ బాలికపై యువతి పైశాచికత్వం: టార్చర్ తట్టుకోలేక 11వ ఫ్లోర్ నుంచి..
కొన్ని నెలల నుంచి బాలికను చిత్రహింసలు పెడుతూ నరకయాతన చూపించింది.
న్యూఢిల్లీ: ఓ మైనర్ బాలికపై 23ఏళ్ల యువతి తన పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. ఒళ్లంతా వాతలు తేలేలా హింసించింది. తప్పించుకోవాలని చూసిన ప్రతీసారి.. ఆ టార్చర్ మరింత దారుణంగా ఉండేది. ఎట్టకేలకు బాలిక ఆమె బారి నుంచి తప్పించుకోవడంతో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
వివరాల్లోకి వెళ్తే.. బిహార్కు చెందిన ఓ యువతి(23) ఫరిదాబాద్ లో చదువుకుంటోంది. స్వగ్రామంలోని తమ ఇంట్లో పనిచేసే ఓ బాలికను.. రెండేళ్ల క్రితం ఫరీదాబాద్ లోని తన ఇంటికి తీసుకొచ్చింది. కొద్దిరోజుల పాటు బాలికను బాగానే చూసుకున్న యువతి.. ఎందుకనో ఆమెను తీవ్రంగా హింసించడం మొదలుపెట్టింది.
ఇంట్లో నుంచి అసలు కాలు కూడా బయటపెట్టకుండా బాలికను హింసించింది. బాలిక ఏడుపులు వినిపించి పొరుగున ఉన్నవారెవరైనా ప్రశ్నించినా.. తమ ఇంటి సంగతి మీకెందుకు? అని సదరు యువతి వారిని బెదిరించేది. దీంతో చాలా కాలంగా బాలిక వేధింపులకు గురవుతూనే ఉంది.
ఇదే క్రమంలో బుధవారం నాడు ఎలాగైనా తప్పించుకోవాలని బాలిక భావించింది. మరో మార్గమేది లేకపోవడంతో.. తాము ఉంటున్న కనిష్క టవర్స్ 11వ అంతస్థు నుంచి కిందకు దూకేసింది. అయితే తొమ్మిదవ ఫ్లోర్ లో ఉన్న ఓ పిట్టగూడులో బాలిక ఇరుక్కుపోవడంతో ఆమెకు ప్రమాదం తప్పింది.
బాలిక అరుపులు విన్న ఓ టీచర్.. పోలీసులకు సమాచారం అందించింది. ఆపై బాలికకు విముక్తి కల్పించి పలు విషయాలు ఆరా తీశారు. బాలిక శరీరమంతా కాల్చిన గాయాలు చూసి చలించిపోయారు.
బాల కార్మికుల చట్టం కింద ఆ యువతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.బాలికను తల్లిదండ్రుల వద్దకు చేర్చేంత వరకు శిశు సంరక్షణ కేంద్రంలో ఉంచాలని ఫరిదాబాద్ శిశు సంరక్షణం కమిటీ అధికారి హెచ్ఎస్ మాలిక్ తెలిపారు.