దారుణం... క్లాస్ రూమ్లో బాలికపై టీచర్ అత్యాచారం.. పాయిజన్ ఇవ్వడంతో బాధితురాలి మృతి..
జార్ఖండ్లో దారుణం జరిగింది. 35 ఏళ్ల ఓ పారా-టీచర్ 13 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెతో బలవంతంగా విషం తాగించాడు. బుధవారం(జనవరి 27) ఈ ఘటన జరగ్గా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధిత బాలిక గురువారం(జనవరి 29) మృతి చెందింది. మృతురాలి తండ్రి స్థానిక పంకి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అత్యాచార ఘటన వెలుగుచూసింది.
లింగ మార్పిడి.. మూడేళ్లుగా గ్యాంగ్ రేప్.. 13 ఏళ్ల బాలుడి భయానక అనుభవం.. ఢిల్లీలో దారుణం..
మృతురాలి తండ్రి ఫిర్యాదు ప్రకారం... ఈ నెల 25న తన కుమార్తె(13)పై శంభు సింగ్(35) అనే పారా టీచర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. పంకి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ స్కూల్లోని ఖాళీ క్లాస్ రూమ్లో ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెప్పాడు. అంతేకాదు,ఈ విషయం బయటకు పొక్కితే చంపేస్తానని బెదిరించాడు.
అత్యాచారం తర్వాత ఆమెతో బలవంతంగా విషం తాగించాడు. దీంతో బాలిక అక్కడే కుప్పకూలిపోగా... విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు గురువారం మృతి చెందింది. పోస్టుమార్టమ్ రిపోర్టులో ఆమెపై విష ప్రయోగం జరిగినట్లు వెల్లడైంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధిత బాలిక కుటుంబంతో నిందితుడికి గతంలో భూ వివాదం నడిచినట్లు అనుమానిస్తున్నారు.
ఇదే జార్ఖండ్లో ఈ నెల 9న ఛత్రా జిల్లాలోని కోబ్నా గ్రామంలో 50 ఏళ్ల ఓ వితంతువుపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగుచూసిన సంగతి తెలిసిందే. నిందితులు ఆమె జననాంగాల్లో స్టీల్ గ్లాసును దూర్చి చిత్రహింసలకు గురిచేశారు.
గతేడాది డిసెంబర్లో జార్ఖండ్లోని దుంకా జిల్లాలో భర్తతో కలిసి సంతకు వెళ్లి తిరిగొస్తున్న ఓ వివాహిత గ్యాంగ్ రేప్కు గురైంది. అంతకుముందు,ఖుంతీ జిల్లాలోని కర్రా పోలీస్ స్టేషన్ పరిధిలో 15 ఏళ్ల మైనర్ బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ప్రతిపక్ష బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది.