లింగ మార్పిడి.. మూడేళ్లుగా గ్యాంగ్ రేప్.. 13 ఏళ్ల బాలుడి భయానక అనుభవం.. ఢిల్లీలో దారుణం..
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగుచూసింది. ఓ 13 ఏళ్ల బాలుడికి బలవంతంగా లింగ మార్పిడి చేయించిన ఓ ముఠా కొన్నేళ్లుగా అతనిపై అత్యాచారానికి పాల్పడుతోంది. గతంలో ఒకసారి ఆ ముఠా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి చావు దెబ్బలు తిన్న ఆ బాలుడు... ఇటీవల మరోసారి తప్పించుకున్నాడు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్లో తలదాచుకున్న ఆ బాలుడు ఓ న్యాయవాది కంటపడటం... తన పరిస్థితి గురించి వివరించడంతో ఈ దారుణం వెలుగుచూసింది. ఢిల్లీ మహిళా కమిషన్ చొరవతో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు.
శుభమ్ అనే బాలుడికి జరిగిన దారుణం...
ఢిల్లీ మహిళా కమిషన్ కథనం ప్రకారం... ఢిల్లీకి చెందిన శుభమ్(పేరు మార్చాం) అనే బాలుడు మూడేళ్ల క్రితం స్థానిక లక్ష్మీనగర్లోని ఓ డ్యాన్స్ ఈవెంట్లో పాల్గొన్నాడు. అక్కడ ఓ వ్యక్తితో శుభమ్కి పరిచయం ఏర్పడింది. తనకూ డ్యాన్స్ నేర్పించాలని శుభమ్ ఆ వ్యక్తిని కోరాడు. దీంతో శుభమ్ను కూడా ఆ వ్యక్తి తనతో పాటే తీసుకెళ్లాడు. కొన్నాళ్ల పాటు శుభమ్ను తన గదిలోనే ఉంచుకుని డ్యాన్స్ నేర్పించాడు. ఆ తర్వాత పలు డ్యాన్స్ ఈవెంట్స్కు శుభమ్ను పంపించడంతో పాటు అతనికి కొంత డబ్బు కూడా ఇచ్చేవాడు.
బలవంతంగా లింగ మార్పిడి...
అలా అంతా సాఫీగానే సాగుతోందని శుభమ్ భావిస్తున్న తరుణంలో కథ ఒక్కసారిగా అడ్డం తిరిగింది. 'ఇకనుంచి నువ్వు నాతో ఉండకూడదు... ఒక డ్యాన్స్ గ్రూప్ ఉంది.. వారితోనే ఉండాలి... వారితోనే పనిచేయాలి.' అని ఆ వ్యక్తి శుభమ్తో చెప్పాడు. దీనికి శుభమ్ అంగీకరించడంతో వారి వద్దకు తీసుకెళ్లాడు. ఆపై శుభమ్కు ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి. శుభమ్కు వారు డ్రగ్స్ ఇవ్వడంతో కొన్నిరోజుల పాటు మత్తులోనే ఉండిపోయాడు. అదే సమయంలో శుభమ్కు బలవంతంగా లింగమార్పిడి సర్జరీ చేయించారు. అప్పటికి శుభమ్ వయసు 13 ఏళ్లు మాత్రమే.
భిక్షాటన కూడా చేయించారు...
లింగ మార్పిడి తర్వాత శరీరంలో మార్పుల కోసం శుభమ్కు కొన్ని హార్మోన్ ఇంజెక్షన్లు కూడా ఇచ్చారు. కొద్దిరోజుల తర్వాత శుభమ్కు టార్చర్ మరింత ఎక్కువైంది. శుభమ్ను తీసుకెళ్లిన వ్యక్తితో పాటు అతని గ్యాంగ్ ఆ బాలుడిపై గ్యాంగ్ రేప్కి పాల్పడటం మొదలుపెట్టారు. అంతేకాదు,బలవంతంగా విటుల వద్దకు కూడా పంపించారు. ఆడవాళ్ల దుస్తులు వేసి... ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నిలబెట్టి భిక్షాటన చేయించేవారు. ఆ గ్యాంగ్ కూడా కొన్నిసార్లు ఆడవాళ్ల దుస్తులు వేసుకుని రోడ్లపై హల్చల్ చేసేవారు. వాహనదారులను ఆపి డబ్బులు వసూలు చేసేవారు.
పారిపోయినా... వెతికి పట్టుకుని మరీ...
ఈ వ్యవహారం ఎవరికైనా చెప్తే.. నిన్ను,నీ కుటుంబాన్ని చంపేస్తామని శుభమ్ను ఆ గ్యాంగ్ బెదిరించింది.ఇదే క్రమంలో ఆ గ్యాంగ్ మరో బాలుడిని కూడా అక్కడికి తీసుకొచ్చింది. ఆ బాలుడితో శుభమ్కు అంతకుముందే పరిచయం ఉంది. దీంతో శుభమ్ తనకు జరిగిన దారుణాన్ని ఆ బాలుడికి వివరించాడు. గతేడాది మార్చిలో ఇద్దరూ కలిసి అక్కడినుంచి తప్పించుకున్నారు. ఇద్దరూ శుభమ్ ఇంటికి వెళ్లారు. అయినప్పటికీ ఆ గ్యాంగ్ వారిని వదల్లేదు. గతేడాది డిసెంబర్లో శుభమ్ ఇంటి చిరునామా తెలుసుకుని అక్కడికి వెళ్లారు.
ఢిల్లీ మహిళా కమిషన్ చొరవతో...
శుభమ్ను విపరీతంగా కొట్టి తిరిగి తమతో పాటు తీసుకెళ్లారు. శుభమ్తో పాటు ఉన్న మరో బాలుడిని కూడా లాక్కెళ్లారు. శుభమ్ తల్లిని గన్తో బెదిరించి... ఎవరికైనా చెప్తే చంపేస్తామని హెచ్చరించారు. తమ స్థావరానికి తీసుకెళ్లాక మళ్లీ శుభమ్పై నిత్యం గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు. అక్కడికి వెళ్లిన రెండు రోజులకే శుభమ్తో పాటు ఆ బాలుడు మరోసారి వారి నుంచి తప్పించుకున్నారు. ఇద్దరూ ఢిల్లీ రైల్వే స్టేషన్లో తలదాచుకున్న సమయంలో... ఓ న్యాయవాది వీరిని గమనించాడు. ఇద్దరితో మాట్లాడి వారి పరిస్థితి గురించి తెలుసుకున్నాడు. అనంతరం ఇద్దరినీ ఢిల్లీ మహిళా కమిషన్ వద్దకు తీసుకెళ్లి ఫిర్యాదు చేశాడు. ఢిల్లీ మహిళా కమిషన్ ఈ దారుణాన్ని తీవ్రంగా పరిగణించి వెంటనే చర్యలు తీసుకుంది. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా మిగతా గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు బాధిత బాలురకు పునరావాసం,రక్షణ అందిస్తామని మహిళా కమిషన్ వెల్లడించింది.