షాకింగ్ న్యూస్: కోట్లాది ఆధార్, బ్యాంక్ ఖాతా నంబర్లు లీక్! భద్రత డొల్లేనా?
జార్హండ్ లీక్ వ్యవహారం మర్చిపోకముందే ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా మరో భారీ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
న్యూఢిల్లీ: ఆధార్ కార్డుల లీక్కు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఆధార్ డేటా లీక్ అయ్యే ఛాన్సే లేదని పదే పదే కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తున్నప్పటికీ తాజా పరిశోధన ఒకటి దీనికి సంబంధించిన భద్రతా వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెట్టింది.
జార్హండ్ లీక్ వ్యవహారం మర్చిపోకముందే ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా మరో భారీ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సుమారు 14కోట్లు (13కోట్ల 5లక్షల) ఆధార్కార్డులు, పది కోట్లకు పైగా బ్యాంకు ఖాతాల సమాచారం లీక్ అయినట్లు తాజా రిపోర్ట్ వెల్లడించింది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపింది.
సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ సోమవారం విడుదల చేసిన కొత్త పరిశోధనా నివేదిక ప్రకారం కేంద్ర మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతారహిత సమాచార భద్రతా పద్దతుల ద్వారా 135 మిలియన్ల ఆధార్ నంబర్లు లీక్ అయ్యాయి. వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల అక్రమ భద్రతా పద్ధతుల కారణంగా గత రెండు నెలల్లో భారీగా డేటా బహిర్గతమైంది.
నాలుగు ప్రభుత్వ డేటాబేస్ లను ఈ సంస్థ అధ్యయనం చేసింది. మొదటి రెండు గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందినవి. వాటిలో ఒకటి నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (ఎన్ఎస్ఎపి) డాష్ బోర్డు కాగా, మరొకటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎన్.ఆర్.ఇ.జి.ఎ) పోర్టల్.
మిగిలిన రెండు డేటాబేస్ లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్నానికి చెందినవి. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఎన్ఆర్ఇజిఎ పోర్టల్ , రాష్ట్ర ప్రభుత్వ పథకానికి సంబంధించిన ఆన్ లైన్ డాష్ బోర్డ్ "చంద్రన్న బీమా" ది.
ఈనాలుగు పోర్టల్స్ ద్వారా 130-135 మిలియన్లదాకా ఉండొచ్చని అంచనా వేసింది. అలాగే వంద మిలియన్లు(కోటి) దాకా బ్యాంక్ ఖాతా నెంబర్లు బహిర్గతమయ్యాయని అధ్యయన వేత్తలు అంబర్ సిన్హా , కొడాలి శ్రీనివాస్ తెలిపారు. ఈ డేటా లీక్ లో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) పాత్రపై విశేషంగా ప్రస్తావించారు.
తమ పరిశోధన కొనసాగుతుండగా పిఐఐ (వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం) కి కొంత భద్రత కల్పించినట్టు గమనించామన్నారు. ఇటీవల ఆధార్ లీక్ లపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో డేటాబేస్ సంస్థలు స్పందించినట్టు చెప్పింది.
ఇటీవల జార్ఖండ్ ప్రభుత్వ విభాగ వెబ్సైట్లో లక్షలాది మంది పెన్షన్ లబ్ధిదారుల ఆధార్, మొబైల్ నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలు వెల్లడైన నేపథ్యంలో కేంద్రం స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలు ప్రభుత్వ విభాగాల వెబ్సైట్లలో లబ్ధిదారుల ఆధార్ కార్డు, వ్యక్తిగత వివరాలు బహిర్గతమైతే కఠిన చర్యలు తప్పవని రాష్ట్రాలను హెచ్చరించింది. అంతేకాదు మూడేళ్ల జైలు శిక్ష కూడా పడుతుందని తేల్చి చెప్పింది. అయినా సమాచారం లీకవడం మాత్రం ఆగడం లేదు.