రిపబ్లిక్ డే వేడుకలు లక్ష్యంగా భారతదేశంలోకి చొరబాటు యత్నాల్లో 135మంది ఉగ్రవాదులు: కాశ్మీర్ బీఎస్ఎఫ్ ఐజీ
రిపబ్లిక్ డే వేడుకలను టార్గెట్ చేసుకొని భారత దేశంలోకి చొరబడడం కోసం, విధ్వంసం సృష్టించడం కోసం ఉగ్రవాదులు సరిహద్దు అవతల వేచి చూస్తున్నట్లుగా కశ్మీర్ బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు వెల్లడించారు . గణతంత్ర దినోత్సవ వేడుకల్లో టార్గెట్ చేసి ఉగ్రవాదులు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే అవకాశముందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికల నేపథ్యంలో తాము అప్రమత్తమయ్యామని పేర్కొన్నారు.
సరిహద్దు అవతలవైపు 135 మంది ఉగ్రవాదులు
గణతంత్ర దినోత్సవాల నేపథ్యంలో దేశంలోకి చొరబడేందుకు దాదాపు 135 మంది ఉగ్రవాదులు సరిహద్దు అవతలవైపు వేచి చూస్తున్నట్టు సమాచారం అందిందని కశ్మీర్ బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ రాజాబాబు సింగ్ సోమవారం తెలిపారు. చొరబాట్లు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సరిహద్దు వెంబడి పహారా పెంచామని ఆయన వెల్లడించారు.
నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. అయితే డ్రోన్లతో కాస్త సమస్య ఉందని పేర్కొన్నారు. గతేడాది కూడా తమకు కొన్ని డ్రోన్స్ కనిపించాయని అయితే అవి మన వైపు రాలేదని వివరించారు. ఈ ఏడాది యాంటీ డ్రోన్ పద్ధతులను వినియోగిస్తున్నామని చెప్పిన ఆయన, మన దేశానికి కావాల్సిన డ్రోన్స్ కూడా సమకూర్చుకుంటున్నాం అంటూ వెల్లడించారు. వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితి ప్రస్తుతం కంట్రోల్ లోనే ఉందని ఆయన పేర్కొన్నారు .
భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదుల కుట్రలు
సరిహద్దు ప్రాంతాల్లో జోరుగా కార్యకలాపాలు సాగుతున్నాయని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో, మళ్ళీ ఎక్కువ మంది చొరబాటుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. జమ్మూ మరియు కాశ్మీర్ను నాశనం చెయ్యటం కోసం విధ్వంసాలకు పాల్పడడం పాకిస్తాన్ మిషన్లో భాగంగా ఉందని చెప్పారు.
భారత్-పాకిస్థాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని వెల్లడించారు . అయితే మాదక ద్రవ్యాలు మరియు ఆయుధాల అక్రమ రవాణా, చొరబాటు కోసం నిర్మించబడుతున్న సొరంగాలు వంటి వాటిని గుర్తించే పనిలో భద్రత దళాలు ఉన్నాయని వెల్లడించారు.
2021లో స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, ఆయుధ సామాగ్రి లెక్క ఇదే
2021లో, బోర్డర్ సెక్యూరిటీ గార్డ్స్ 17 ఆయుధాలు మరియు 900 రౌండ్ల మందుగుండు సామగ్రిని, 30 పేలుడు పరికరాలు మరియు 38 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. సరిహద్దుల్లో నాలుగు ఎకె-47 రైఫిళ్లు, ఏడు ఎకె-47 మ్యాగజైన్లు, 339 రౌండ్ల ఎకె మందుగుండు సామగ్రి, 13 పిస్టల్లు, 32 పిస్టల్ మ్యాగజైన్లు, 371 పిస్టల్ మందుగుండు సామగ్రి, 13 గ్రెనేడ్లు, 2316 మీటర్ల వైర్టెక్స్, ఒక వైర్లెస్ సెట్, ఆరు మొబైల్ సెట్లు, ఒక రేడియో రిసీవర్, 13 డిటోనేటర్లు, 15 డిటోనేటర్ ఫ్యూజులు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చేసిన రికవరీలలో ఉన్నాయని అధికారులు తెలిపారు.
భారీగా డ్రగ్స్ పట్టుకున్న బీఎస్ఎఫ్ దళాలు
మొత్తం 38.160 కిలోల మాదక ద్రవ్యాలు, 2,75,000 విలువ కలిగిన నకిలీ భారతీయ కరెన్సీతో పాటు అఖ్నూర్ నుండి 10.93 కిలోల మాదకద్రవ్యాలను కూడా బిఎస్ఎఫ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయని వారు తెలిపారు. కతువా సరిహద్దు నుంచి మాదక ద్రవ్యాల సరుకును అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ వ్యక్తిని కూడా సైనికులు మట్టుబెట్టారు. అతని వద్ద నుంచి దాదాపు 27.25 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
రెండు సొరంగాలను గుర్తించిన బీఎస్ఎఫ్ ... సరిహద్దుల్లో నిఘా పెంచి మరీ గస్తీ
అంతర్జాతీయ సరిహద్దు వెంబడి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యాంటీ టన్నెల్ డ్రైవ్లను నిర్వహించింది. ఇది రెండు సొరంగాలను గుర్తించింది. దీని ఫలితంగా పాకిస్తాన్ చొరబాటు ప్రయత్నాలకు భారీగా గండి ఏర్పడింది.తాలిబన్ల ముప్పు, అఫ్గానిస్తాన్ నుంచి కశ్మీర్కు ఆయుధాలు, మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయి అన్న వార్తలపై స్పందిస్తూ.. ఇప్పటివరకైతే అలాంటి సమాచారమేం లేదన్నారు.
సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసి, పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని, నిఘా పెంచామని చెప్పారు. కొంత మంది గైడ్లు నియంత్రణరేఖ దాటి అవతలివైపునకు వెళ్లారని వాళ్లు ఇటువైపు వచ్చాక వాళ్లపైన, వాళ్ల కుటంబాలపైనా కూడా నిఘాపెడతామన్నారు.