ఒక్కరోజులో వేలకొద్దీ కేసులు: ఫ్రెష్ హాట్స్పాట్స్ స్టేట్స్ ఇవే: మళ్లీ లాక్డౌన్: సరిహద్దులు క్లోజ్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్.. మరో రౌండ్ విజృంభణ మొదలు పెట్టింది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొద్దిరోజులుగా పరిమితంగా నమోదవుతూ వస్తోన్న కొత్త పాజిటివ్ కేసులు.. ఒక్కసారిగా పెరిగాయి. ఒక్కరోజులో ఉప్పెనలా విరుచుకుపడ్డాయి. ఫలితంగా- అనేక రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలను చేపట్టాయి. కొత్త కరోనా కేసుల పెరుగుదల ఇలాగే కొనసాగితే అనేక రాష్ట్రాలు మళ్లీ లాక్డౌన్లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటికే కర్ఫ్యూ, పాక్షికంగా లాక్డౌన్ అమల్లో ఉంది. కొన్ని రాష్ట్రాలు సరిహద్దులను మూసివేశాయి. ఇదివరకట్లా పరీక్షలను నిర్వహించిన తరువాతే.. రాకపోకలు సాగించడానికి అనుమతి ఇస్తోన్నాయి.
Recommended Video
నిర్లక్ష్యానికి తగిన మూల్యం?: కరోనా కేసుల పెరుగుదల..ఆందోళనకరంగా: లాక్డౌన్ తప్పదా?
24 గంటల్లో 14 వేలకు పైగా
24 గంటల వ్యవధిలో కొత్తగా దేశవ్యాప్తంగా 14 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం ఉలికిపాటుకు గురి చేస్తోంది. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుదల ఉధృతంగా ఉంటోంది. వరుసగా నాలుగు రోజుల పాటు వేలకొద్దీ కేసులు నమోదు అయ్యాయి. 6,971 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్రలో ఆరువేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం వరుసగా నాలుగోసారి. కేరళలో కొత్త కరోనా కేసుల తీవ్రత తక్కువేమీ కాదు. అక్కడ ఆదివారం నాడు 4,070 కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడు, కర్ణాటకల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తమిళనాడు-452, కర్ణాటక-413, పంజాబ్-348 కేసులు రికార్డు అయ్యాయి.
తాజా హాట్స్పాట్లుగా అయిదు రాష్ట్రాలు..
మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్.. కరోనా కొత్త కేసులకు తాజా హాట్స్పాట్లుగా మారాయి. ఫలితంగా- ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం విదర్భ ప్రాంతంలో పాక్షికంగా లాక్డౌన్ విధించింది. అమరావతి, అకోలా వంటి జిల్లాల్లో రాత్రి పూట కర్ఫ్యూను విధించింది. కర్ణాటక-కేరళ రాష్ట్రాలు సరిహద్దులను కట్టుదిట్టం చేశాయి. కేరళ నుంచి కర్ణాటకలో అడుగు పెట్టదలిచిన వారికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తోన్నారు. కేరళ-కర్ణాటక సరిహద్దుల్లోని థలపాడి చెక్పోస్ట్ వద్ద తనిఖీలను చేపట్టారు. ఆర్టీ-పీసీఆర్ సర్టిఫికెట్ ఉంటేనే రాకపోకలు సాగించడానికి అనుమతి ఇస్తోన్నారు.
మహారాష్ట్ర ఎఫెక్ట్తో
మహారాష్ట్ర విదర్బ ప్రాంతాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల పెరుగుదలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దులపై నిఘా పెట్టింది. ఇదివరకట్లా స్వేచ్ఛగా రాకపోకలు సాగించడానికి వీలు లేకుండా చర్యలను తీసుకుంటోంది. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలను సాగించే వారికి కరోనా నిర్ధారణ పరీక్షలను చేపట్టనుంది. కరోనా వైరస్ లేదని నిర్ధారించే సర్టిఫికెట్లు ఉంటే తప్ప.. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి అడుగు పెట్టనివ్వకూడదంటూ జిల్లా అధికారులకు మౌఖికంగా ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తోంది. సోమవారం విడుదల చేసిన రిపోర్టుల ప్రకారం.. భారత్లో 24 గంటల వ్యవధిలో కొత్తగా 14,199 కేసులు నమోదు అయ్యాయి. 83 మంది మరణించారు.