కర్నాటకం : స్పీకర్ సంచలన నిర్ణయం.. 14 మంది రెబెల్ ఎమ్మెల్యేల సస్పెన్షన్..
బెంగళూరు : కన్నడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. యడియూరప్ప ప్రభుత్వం విశ్వాస పరీక్షకు ఒక్కరోజు ముందు కర్నాటకంలో ట్విస్ట్ వచ్చింది. రెబెల్ ఎమ్మెల్యేపై స్పీకర్ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో ముగ్గురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన ఆయన.. మిగిలిన 14 మంది ఎమ్మెల్యేలపై వేటు వేశారు. దీంతో మొత్తం 17 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించినట్లైంది.
ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు
అనర్హతకు గురైన 17 మందిలో ముగ్గురు జేడీఎస్, 14 మంది కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. యడియూరప్ప బలపరీక్షకు ముందు స్పీకర్ తీసుకున్న నిర్ణయంతో కన్నడ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆదివారం మీడియా సమావేశం నిర్వహించిన స్పీకర్ రమేష్ కుమార్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయంతో ప్రతాప్ గౌడ పాటిల్, బీసీ పాటిల్, శివరామ్ హెబ్బార్, ఎస్టీ సోమశేఖర్, బీఈ బసవరాజు, ఆనంద్ సింగ్, ఆర్ రోషన్ బేగ్, మునిరత్న, కే. సుధాకర్, ఎంటీబీ నాగరాజు, ఏహెచ్ విశ్వనాథ్, కే గోపాలయ్య, నారాయణ గౌడ, శ్రీమంత్ పాటిల్ ఎమ్మెల్యే పదవులు కోల్పోయారు. అనర్హత వేటు పడటంతో వారు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. వీరంతా మళ్లీ 2023 ఎన్నికల్లో మాత్రమే పోటీ చేసే అవకాశముంది.
వ్యూహాత్మకంగా వ్యవహరించిన స్పీకర్
ఇదిలా ఉంటే కొత్తగా ఏర్పాటైన యడియూరప్ప ప్రభుత్వం సోమవారం విశ్వాస పరీక్ష ఎదుర్కోనుంది. అందుకు ఒక్కరోజు ముందు స్పీకర్ తీసుకున్న నిర్ణయం బీజేపీకే కలిసి రానుంది. కూటమి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో కమలనాథులు బలపరీక్షలో మరింత సులభంగా గట్టెక్కె అవకాశముంది. ఇదిలా ఉంటే బలపరీక్షకు ముందు స్పీకర్ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ - జేడీఎస్ వ్యూహాల్లో భాగమేనని అంటున్నారు. రెబెల్ ఎమ్మెల్యేలు, బీజేపీకి మద్దతు ఇవ్వకుండా, వారికి మంత్రి పదవులు దక్కకుండా చేయాలన్న ఉద్దేశంతో రమేష్ కుమార్ వారిపై అనర్హత వేటు వేసినట్లు తెలుస్తోంది.
104కు తగ్గిన మేజిక్ ఫిగర్
కర్నాటక అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 224. ప్రస్తుతం 17 మందిపై వేటు పడటంతో ఈ సంఖ్య 207కు పడిపోయింది. మేజిక్ ఫిగర్ 104కు తగ్గింది. బీజేపీకి సొంతంగా 105 మంది సభ్యులతో పాటు ఇద్దరు స్వతంత్రులతో కలిసి పార్టీ బలం 107కు చేరింది. మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్ బలం 99కి పడిపోయింది. ఈ నేపథ్యంలో బీజేపీ విశ్వాస పరీక్షలో తేలికగా గట్టెక్కే అవకాశముంది. ప్రస్తుత పరిస్థితుల్లో యడియూరప్ప సర్కారుకు వచ్చిన ఇబ్బందేమీ లేదని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు.