నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం, లోయలో పడ్డ బస్సు 14 మంది మృతి, 18 మందికి గాయాలు
నేపాల్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో 14 మంది ప్యాసెంజర్స్ చనిపోగా, 18 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
నేపాల్లో ప్రముఖ హిందు దేవాలయం కలించొక్ భాగవతి ఆలయాన్ని దర్శించుకొని ప్రయాణికులు తిరిగి వస్తున్నారు. నేపాల్ రాజధాని కాఠ్మండుకు 80 కిలోమీటర్ల దూరంలో బస్సు ఉన్నప్పుడు ప్రమాదానికి గురైంది. లోయలో పడిపోవడంతో.. అందులో ఉన్న ప్రయాణికులు కొందరు చనిపోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికుల సమాచారంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. బస్సుల్లోంచి మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి గల కారణంపై విచారణ జరిపిస్తామని పోలీసు అధికారి మహారాజన్ పేర్కొన్నారు. సాధారణంగా శీతాకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని చెప్పారు. ఉదయం పూట మంచుకురవడంతో దారి కనపడదని వివరించారు.
దీంతోపాటు బస్సు ఈ ప్రాంతానికి చెందినది కాదని చెప్పారు. డ్రైవర్కు కూడా రోడ్డుపై సరైన అవగాహన లేదని చెప్పారు. దీంతో మంచులో రోడ్డును సరిగా అంచనావేయకపోవడంతో ప్రమాదం జరిగి ఉంటుందని చెప్తున్నారు. నేపాల్లో రహదారులన్నీ పర్వతప్రాంతాలు ఉంటాయి. రహదారులు సరిగా ఉండకపోవడం, వాహనాల కండీషన్ బాగాలేకపోవడంతోనే ప్రమాదం జరుగుతుందని మహారాజన్ తెలిపారు.