యూకె రిటర్నీస్ : కర్ణాటకలో 14 మందికి,కేరళలో 8 మందికి పాజిటివ్... పుణే ల్యాబ్కు శాంపిల్స్
ఇటీవల యూకె నుంచి భారత్కు వచ్చిన ప్రయాణికుల్లో కరోనా పాజిటివ్గా నిర్దారణ అయినవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా కర్ణాటకకు చెందిన 14 మంది యూకె రిటర్నీస్కు,కేరళకు చెందిన 8 మంది యూకె రిటర్నీస్కు కరోనా పాజిటివ్గా తేలింది. యూకె నుంచి వచ్చినవారిలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో కొత్త టెన్షన్ మొదలైంది. బ్రిటన్లో కోవిడ్ 19 కొత్త స్ట్రెయిన్ వెలుగుచూసిననేపథ్యంలో.. వీళ్లలో ఎవరైనా ఆ వైరస్ బారిన పడ్డారా అన్న ఆందోళన నెలకొంది.
కర్ణాటకలో 2500 మంది యూకె రిటర్నీస్...
కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడుతూ కె.సుధాకర్ మాట్లాడుతూ ఇటీవలి కాలంలో బ్రిటన్ నుంచి మొత్తం 2500 మంది రాష్ట్రానికి వచ్చినట్లు తెలిపారు. వీరిలో 1638 మందికి ఇప్పటికే కరోనా టెస్టులు చేశామని... ఇందులో 14 మందికి పాజిటివ్గా తేలిందన్నారు. వీరికి సోకిందా కొత్త రకం కరోనా వైరసా లేక పాత రకం వైరసా అన్నది ఇంకా తేలాల్సి ఉందన్నారు. ఇందుకోసం వారి శాంపిల్స్ను పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్కు పంపించినట్లు తెలిపారు. మరో 48 గంట్లో ఆ శాంపిల్స్ ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నారు.
కేరళ ఆరోగ్య శాఖ మంత్రి ఏమంటున్నారు...
అటు కేరళలోనూ యూకె నుంచి వచ్చిన 8 మందికి పాజిటివ్గా నిర్దారణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.కె.శైలజ వెల్లడించారు.వీరి శాంపిల్స్ను పుణేలోని వైరాలజీ ల్యాబ్కు పంపించామని... ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం వీరంతా క్వారెంటైన్లో ఉన్నట్లు చెప్పారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్రంలో పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని... అందుకే ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా ఎక్కడా వైరస్ వ్యాప్తి జరగలేదన్నారు. ప్రస్తుతం కేరళలోని అన్ని విమానాశ్రయాల్లో నిఘా మరింత పెంచారు. యూకె నుంచి వచ్చినవారికి వెంటనే టెస్టులు నిర్వహించి క్వారెంటైన్కు పంపిస్తున్నారు.
ఆందోళన రేకెత్తిస్తున్న కొత్త స్ట్రెయిన్
బ్రిటన్లో కొత్త స్ట్రెయిన్ వెలుగుచూడటంతో ఈ నెల 23 నుంచి 31 వరకూ భారత్ బ్రిటన్కు విమాన రాకపోకలు నిషేధించింది. అయితే 23వ తేదీ అర్ధరాత్రి వరకూ వేల సంఖ్యలో ప్రయాణికులు యూకె నుంచి భారత్ చేరుకున్నారు. రెండు రోజుల క్రితం ఆయా రాష్ట్రాలు వెల్లడించిన వివరాల ప్రకారం... యూకె నుంచి తెలంగాణకు 358 మంది, ఢిల్లీకి దాదాపు 7వేల మంది,చెన్నైకి 1088 మంది వచ్చారు.రాష్ట్రాల ఆరోగ్య శాఖ అధికారులు వీరిని ట్రాక్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో వీరికి కరోనా టెస్టులు నిర్వహించి క్వారెంటైన్లోకి పంపిస్తున్నారు.