మహిళల కంపార్ట్మెంట్లోకి యువకుడు.. భయంతో రైలు నుంచి దూకేసిన బాలిక
ఖాళీగా ఉన్న మహిళల కంపార్ట్మెంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించడంతో ఒంటరిగా ఉన్న ఓ బాలిక భయపడిపోయింది. అతడు తనపై దాడి చేసేందుకే వస్తున్నాడనుకుని కదులుతున్న రైలు నుంచి దూకేసింది.
ముంబై: ఖాళీగా ఉన్న మహిళల కంపార్ట్మెంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించడంతో ఒంటరిగా ఉన్న ఓ బాలిక భయపడిపోయింది. అతడు తనపై దాడి చేసేందుకే వస్తున్నాడనుకుని కదులుతున్న రైలు నుంచి దూకేసింది.
ఘోరం: కూతురికి లైంగిక వేధింపులు.. కేసు పెడితే.. తండ్రినే తగలబెట్టేశారు!
ఈ ఘటన ముంబైలో ఆదివారం జరిగింది. ఎనిమిదో తరగతి చదువుతున్న పాయల్ కాంబ్లే(14) ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వద్ద కళ్యాణ్-బౌండ్ రైలెక్కింది. క్లాసులకు ఆలస్యం అవుతుండడంతో మహిళా కంపార్ట్మెంట్ అయినా పర్వాలేదనుకుని అందులోకి ఎక్కేసింది.
తీరా రైలు బయలుదేరాక అదే కంపార్ట్ మెంట్ లోకి గుర్తు తెలియని యువకుడు ప్రవేశించడంతో బాలిక భయపడింది. పైగా బాలిక ఎక్కిన కంపార్ట్ మెంట్ లో ఆ సమయంలో ఎవరూ లేరు.
కంపార్ట్ మెంట్ లో ఆ బాలిక తప్ప ఎవరూ లేకపోవడం గమనించిన ఆ యువకుడు ఉన్నట్లుండి ఆమె వైపు కదిలాడు. దీంతో భయపడిన బాలిక తొలుత చైన్ లాగేందుకు ప్రయత్నించిందని, అది కుదరకపోవడం, ఈలోగా అతడు ఆమెను సమీపించడంతో ఏం చేయాలో తెలియక, మరో మార్గం లేక రైలు నుంచి దూకేసింది.
జీఆర్పీ పోలీసులతో బాధిత బాలిక మాట్లాడుతూ కోచ్లో తాను మాత్రమే ఉన్నానని, ఈలోపు గుర్తు తెలియని వ్యక్తి లోనికి ప్రవేశించాడని తెలిపింది. ఇది మహిళలకు కేటాయించిన బోగీ అని, తర్వాతి స్టాపులో దిగేయాలని అతడితో చెప్పానని పేర్కొంది.
అందుకతడు 'నోర్ముయ్' అంటూ బాలిక దగ్గరికి వెళ్లడంతో అతడు తనపై దాడి చేసేందుకే వస్తున్నాడని బాలిక బయపడిందని జీఆర్పీ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మాచింద్ర చావన్ తెలిపారు.
ఆ సమయంలో రైలు మసీదు బందర్ స్టేషన్కు చేరుకుందని, అక్కడ కొందరు పోలీసులు ఉండడాన్ని చూసిన ఆ బాలిక మెల్లగా కదులుతున్న రైలు నుంచి కిందికి దూకేసిందని ఆయన వివరించారు. తాము సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.