14 ఏళ్ళ బాలికపై గ్యాంగ్రేప్, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్
బీహార్లో ఓ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు నలుగురు దుండగులు. ఈ దృశ్యాలను సెల్ఫోన్లలో చిత్రీకరించారు.ఈ నలుగురు యువకులకు మరో ముగ్గురు యువకులు సహకరించారని పోలీసులు తెలిపారు.
ముజఫర్పూర్: బీహార్లో ఓ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు నలుగురు దుండగులు. ఈ దృశ్యాలను సెల్ఫోన్లలో చిత్రీకరించారు.ఈ నలుగురు యువకులకు మరో ముగ్గురు యువకులు సహకరించారని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్టు ఎస్పి వివేక్కుమార్ తెలిపారు.
దసరా ఉత్సవంలో పాల్గొని ఇంటికి తిరిగి వస్తున్న 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని ఎస్పీ వివేక్కుమార్ చెప్పారు. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి బాలికను ఎత్తుకెళ్లి అఘాయిత్యం చేశారని, దాన్ని సెల్ఫోన్ వీడియోలో చిత్రించినట్టు ఆయన పేర్కొన్నారు. వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారని ఎస్పీ తెలిపారు.
ఈ ఘాతుకానికి పాల్పడిన నలుగురు యువకులతోపాటు మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్పీ చెప్పారు. . ఆదివారం రాత్రి నిందితులపై కాట్రా పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు ఎస్పీ వివేక్ కుమార్ తెలిపారు.
ముజాఫర్పూర్లోని కాట్రా పోలీసు స్టేషన్ పరిధిలోని నవాడా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై సోమవారం పాట్నాలో ముఖ్యమంత్రి నితీశ్కుమార్ మాత్రం స్పందించలేదు. అయితే మహిళాసాధికారిత, సంక్షేమ మంత్రి మంజూ వర్మ మాత్రం సామూహిక రేప్ విషయాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్తానని, దోషులను కఠినంగా శిక్షామని చెప్పారని అన్నారు. బాలికపై జరిగిన అఘాయిత్యాన్ని భవన నిర్మాణ మంత్రి మహేశ్వర్ హజారీ తీవ్రంగా ఖండించారు. నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు.
బాధిత బాలికకు బాసటగా నిలబడతామని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు సుష్మా సాహూ తెలిపారు. మహిళలు, బాలికలపై వరుస సంఘటనలు జరుగుతున్నా నితీశ్ కుమార్ ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ సిఎం రబ్రీదేవి ధ్వజమెత్తారు. పోలీసులు కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఆర్జెడి నాయకురాలు ఆరోపించారు.