బాధ్యత మరిచిన పోలీసులు: 40 కి.మీ నడిచి ఇంటికి చేరుకున్న అత్యాచార బాధితురాలు..ఏం జరిగిందంటే?
పాట్నా: లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీల వెతలు చాలా చదివాం. చాలా చూశాం. తమ సొంతూళ్లకు చేరుకోవాలనే ఉద్దేశంతో కాలినడకనే చాలామంది బయలుదేరారు. మార్గమధ్యలోనే కొందరు మృతి చెందిన ఘటనలనూ చూశాం. ఇలా కొన్ని వందల కిలోమీటర్లు నడిచి సొంతూళ్లకు చేరుకుంటున్నారు. ఇక లాక్డౌన్ అమలులో ఉండటంతో ఓ 14ఏళ్ల అత్యాచార బాధితురాలు తన ఇంటికి చేరుకునేందుకు 40 కిలోమీటర్లు మేరా నడిచిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ బాధాకరమైన ఘటన బీహార్లోని అరారియా జిల్లాలో చోటుచేసుకుంది. విషయం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో 14 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు విరుచుకుపడ్డాడు. ఆ చిన్నారిపై అత్యాచారంకు పాల్పడ్డాడు. ఇది మే నెల మొదట్లో జరిగింది. బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. చిన్నారిపై దాడిచేసిన కామాంధుడిని ఫిరోజ్ అన్సారీగా గుర్తించారు.
ఇక బాధితురాలిని మెడికల్ చెకప్ కోసం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కు పోలీసు వాహనంలో తీసుకెళ్లారు. ఇక అక్కడ వైద్యులకు ఈ చిన్నారిని అప్పగించి పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఆ చిన్నారికి మెడికల్ పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ చిన్నారి తన ఇంటికి నడిచి వెళ్లింది., ఆమెను హాస్పిటల్లో వాహనంలో వదిలేసి పోలీసులు వెళ్లిపోవడం, లాక్డౌన్ కారణంగా వాహనాలు ఏమీ లేకపోవడంతో ఆ చిన్నారి తిరిగి తన ఇంటికి 40 కిలోమీటర్లు మేరా నడిచి చేరుకుంది.
ఇక ఈ విషయం గురించి తెలుసుకున్న బీహార్ రాష్ట్ర మానవహక్కుల సంఘం ఛైర్మెన్ దిల్మానీ మిశ్రా... పోలీసు డిపార్ట్మెంట్ నుంచి వివరణ కోరారు. ఆ చిన్నారిని హాస్పిటల్లో వదిలేసి ఎందుకు అంత నిర్లక్ష్యం వహించారో చెప్పాలని వెంటనే నివేదిక సమర్పించాలని పోలీస్ శాఖను మానవహక్కుల సంఘం ఆదేశించింది.
ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని కోరింది. ఇక అత్యాచార ఘటనలో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు, ఈ చిన్నారిని హాస్పిటల్కు చేర్చిన పోలీసులు వివరణ ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పోలీసు వాహనంలో తనను తీసుకెళ్లి ఒంటరిగా పోలీసులు వదిలేశారని ఆ చిన్నారి ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదిలా ఉంటే బీహార్లో అత్యాచార ఘటనలు నియంత్రణలోకి రావడం లేదు. ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు కాటేసేందుకు కాచుకూర్చున్నారు కామాంధులు. గత ఏడేళ్లలో దాదాపుగా 90వేల అత్యాచార ఘటనలు బీహార్లో నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది 193 అత్యాచార ఘటనలు నమోదు కాగా ఇవన్నీ తొలి రెండు నెలల్లోనే జరగడం విశేషం.