గ్యాంగ్రేప్: అవమాన భారంతో అమ్మాయి ఆత్మహత్యాయత్నం
మథుర: సామూహిక అత్యాచారానికి గురైన ఓ 14 ఏళ్ల బాలిక అవమానభారంతో ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని మథుర జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది.
వివరాల్లోకి వెళితే.. బాలిక(14)పై కోసికలాన్లో ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులు బయటికి రానీయకుండా చూశారు.
కాగా, తనపై జరిగిన అత్యాచారాన్ని అవమానంగా భావించిన బాలిక కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె కేకలు విన్న కుటుంబసభ్యులు మంటలు ఆర్పి, హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. 70శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని, అందుకే బాలిక అఘాయిత్యానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులపై అత్యాచార కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు.