గుజరాత్లో ఘోరం: వైద్యం అందక 15000 మంది నవజాత శిశువుల మృతి
అభివృద్ధి సూచీల్లో అందరికంటే ముందుండే గుజరాత్లో నవజాత శిశువులు పిట్టల్లా రాలిపోయారు. రాష్ట్ర వైద్య శాఖ ఘోర వైఫల్యానికి సంబంధించిన అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతిథి సత్కారాలు పొందిన అహ్మదాబాద్ సిటీలోనైతే పరిస్థితి మరింత దారుణంగా ఉండింది. అప్పుడే పుట్టిన బిడ్డలు వేల సంఖ్యలో చనిపోయినా బీజేపీలో చలనం లేదని, గొప్పగా ప్రచారం చేసుకున్న 'గుజరాత్ మోడల్' అంతా ఫేకని మరోసారి రుజువైందని ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శించింది. అసలేం జరిగిందంటే..
గుజరాత్లో ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి నితిన్ పటేల్ గతనెల 26న రూ.2.17లక్షల కోట్ల విలువైన బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆయా శాఖలకు కేటాయింపులపై సభలో విస్తృత చర్చ జరిగింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు.. రాష్ట్రంలో నవజాత శిశువుల మరణాలపై ప్రశ్నలు సంధించగా, సంబంధిత మంత్రి నితిన్ పటేల్ బుధవారం అసెంబ్లీలో సమాధానం చెప్పారు. ఆ గణాంకాలు అందరినీ షాక్ కు గురిచేశాయి..
షాకింగ్ నంబర్లు..
గుజరాత్ లో గత రెండేళ్లలో ప్రభుత్వాసుపత్రుల్లో మొత్తం 15,013 మంది నవజాత శిశువులు చనిపోయారని డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లో 2018 జనవరి నుంచి 2019 డిసెంబర్ దాకా మొత్తం 1,06,000 మంది శిశువులు పుట్టారని, వాళ్లలో 72 వేల మందికి ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తడంతో సిక్ న్యూబార్న్ కేర్(ఎస్ఎన్సీ) యూనిట్లకు తరలించామని, అక్కడ చికిత్స పొందుతూ మొత్తం 15,013 మంది మరణించారని మంత్రి వివరించారు. సిటీలవారీగా అహ్మదాబాద్ లో అత్యధికంగా 4,322 మంది, వడోదరలో 2,362 మంది, సూరత్ లో 1986 మంది శిశువులు చనిపోయారని వివరించారు.
కారణాలు ఏమంటే..
ఎస్ఎన్సీ యూనిట్లలో డాక్టర్లు, వైద్య సిబ్బంది కొరత కారణంగానే సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించామని, ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆదేశాలు కూడా జారీచేశామని, ప్రస్తుతం పనిచేస్తున్నవాళ్లకు ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నామని, అలాగే, యంత్రపరికరాలు కూడా కొత్తవి తెప్పించాల్సిన అవసరం ఉందని, మొత్తంగా నవజాత శిశువుల మరణాలను అరికట్టడానికి బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని డిప్యూటీ సీఎం పటేల్ అసెంబ్లీకి తెలిపారు. ప్రభుత్వ వివరణపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది.
మీడియాకు పట్టదా?
గుజరాత్ లో గత రెండేళ్లలో 15వేల మంది నవజాత శిశువులు చనిపోవడంపై ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా స్పందించారు. ‘‘గుజరాత్ లో ఇంత ఘోరం జరుగుతున్నాబీజేపీకి చీమైనా కుట్టినట్లు లేదు. ఆ పసిపిల్లల ఆర్తనాదాలు మోదీకి వినిపించడంలేదా? గొప్ప మోడల్ అని చెప్పుకునే రాష్ట్రంలో శిశువుల మరణాలపై ప్రధాన శ్రేణి మీడియా మౌనం వహించడం ఇంకా దారుణం''అని కాంగ్రెస్ నేత విమర్శించారు.