మారెమ్మ ఆలయ విషాదంలో కొత్త కోణం: సిల్లీ రీజన్తో 15 మంది బలి
కర్నాటకలో ఆలయ ప్రారంబోత్సవం సందర్భంగా అక్కడికి వచ్చిన భక్తులు ఆలయ ప్రసాదం సేవించడంతో వాంతులు విరేచనాలు అయి మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రసాదంలో ఏదో విషం కలిసిందని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆ తర్వాత రెండు వర్గాల మధ్య చెలరేగిన గొడవతో ఒక వర్గం వారు ప్రసాదంలో విషం కలిపారని పోలీసులు చెప్పారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించి మరో విషయాన్ని వెల్లడించారు కర్నాటక పోలీసులు. ప్రసాదం తయారు చేసే సమయంలోనే 15 బాటిళ్ల పురుగుల మందు కలిపారని తెలిపారు.
అధికారం కోసం 15 మంది ప్రాణాలు బలిగొన్నాడు
కర్నాటక ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రసాదం సేవించి మృతి చెందిన భక్తుల కేసులో పోలీసలు ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేశారు. ఇందులో ఓ మహిళ, ఆమె భర్త, మరో స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మహదేశ్వర కొండ సాలూరు మఠం ప్రవక్త పట్టడ ఇమ్మడి మహదేశ్వర స్వామి అలియాస్ దేవన్న బుద్ది ఆలయ అధికారాలు తన చేతికి రావాలని తలచి... ప్రస్తుతం ఉన్న ఆలయ యాజమాన్యంపై చెడు అభిప్రాయం కలిగేందుకు ప్రసాదంలో విషం కలిపినట్లు సమాచారం. ఇలా చేస్తే ఆలయ అధికారాలన్నీ తనకే దక్కుతాయని భావించినట్లు సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి శరత్ చంద్ర తెలిపారు. మఠాధిపతి ఆదేశాల మేరకు మహిళ పురుగుల మందు ఏర్పాటు చేయగా ఆమె భర్త అతని స్నేహితుడు ఈ పురుగుల మందును ప్రసాదంలో కలిపినట్లు పోలీసులు వెల్లడించారు.
ట్రస్టు సభ్యులకు మఠాధిపతిల మధ్య మాటల యుద్ధం
ఈ ఘటనలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 15కు చేరుకుంది. మరో 100 మంది ఇంకా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఏప్రిల్ 2017 వరకు ఆలయ అధికారాలు మొత్తం మఠాధిపతి వద్దే ఉన్నాయని చెప్పిన పోలీసులు ఆలయం పేరుతో డబ్బులను విపరీతంగా సంపాదించాడని వెల్లడించారు. ఈ క్రమంలోనే గ్రామస్తులు, స్థానిక భక్తులు కలగజేసుకుని ఆలయ విస్తరణ కోసం ఓ ట్రస్టును ఏర్పాటు చేశారు. ఇక్కడే ఆ మఠాధిపతికి నచ్చలేదు. తన అంగీకారం లేకుండా ట్రస్టు ఏర్పాటును జీర్ణించుకోలేకపోయాడు. తన సంపాదనకు అడ్డుపడుతున్నారని భావించాడు. ఇక అప్పటి నుంచి ట్రస్టు సభ్యులు మఠాధిపతి మధ్య మాటలయుద్ధం నడుస్తోంది.
ట్రస్టుపై కక్ష తీర్చుకుందామని పురుగుల మందు కలిపాడు
ఇక ఈ ఏడాది అక్టోబర్లో గోపురం నిర్మించాలని భావించింది ఆలయ ట్రస్టు. దీనికి సంబంధించిన ప్రణాళికను మఠాధిపతి ముందు ఉంచింది. తమిళనాడులోని ప్రముఖ ఆలయ శిల్పి నుంచి రూ.1.5 కోట్లతో కార్యాచరణ కూడా తీసుకొచ్చారు. దీని ద్వారా ఎంతో కొంత డబ్బు నొక్కుదామని మఠాధిపతి ప్లాన్ వేశారు. ఇందుకు ట్రస్టు సభ్యులు ఒప్పుకోలేదు. అంత ఖర్చు కాదని రూ.75 లక్షలతో పూర్తి అవుతుందని భావించి ఇక భూమిపూజ చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ప్రసాదంలో విషం కలపాల్సిందిగా మహిళను ఈ మఠాధిపతి ఆదేశించడం... ఆ తర్వాత ప్రసాదంలో పురుగుల మందు కలపడం వెంటవెంటనే జరిగిపోయాయి. వంట మనుషులను పంపించి వేసి అందులో పురుగుల మందు కలిపారని పోలీసులు తెలిపారు. వెళ్లిపోయిన వంట మనిషి తిరిగి చేరుకునే సరికి అక్కడ ఏదో చెడు వాసన వస్తున్నట్లు గమనించాడు. అయితే అది కర్పూరం అని చెప్పి అతన్ని తప్పుదోవ పట్టించడం జరిగిందని పోలీసులు తెలిపారు.