జమ్మూకశ్మీర్లో పర్యటించనున్న విదేశీ రాయబారుల బృందం..ఎందుకంటే..?
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేలా ప్రభుత్వం కృషి చేసిందా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు 15 మందితో కూడిన విదేశీ రాయబారుల బృందం ఈ రోజు అక్కడ పర్యటన చేయనున్నట్లు సమాచారం. జమ్మూకశ్మీర్లో గతేడాది ఆగష్టులో ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత అక్కడి పరిస్థితులను సమీక్షిస్తామని ఢిల్లీలోని విదేశీ రాయబారులు కోరిన మేరకు రెండు రోజుల పర్యటన ఖరారు చేశారని సమాచారం. ఇక ఈ బృందంలో మిడిల్ ఈస్ట్ దేశాలు, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు చెందిన దౌత్యాధికారులు ఉన్నట్లు సమాచారం. వీరందరినీ కశ్మీర్కు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బృందంలో సభ్యుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
జమ్మూ కశ్మీర్లో పర్యటించనున్న తొలి బృందంలో యూరోపియన్ యూనియన్ దేశాలకు చెందిన సభ్యులు ఉండరని తెలుస్తోంది. వారు కొంత కాలం తర్వాత ఇక్కడ పర్యటిస్తారని సమాచారం. ఢిల్లీలోని యూరోపియన్ యూనియన్ దేశాలకు చెందిన అధికారులు వారి పర్యటన గురించి విదేశీ వ్యవహారాలశాఖతో చర్చిస్తున్నట్లు సమాచారం. పర్యటనకు సంబంధించిన తేదీలు ఇంకా ఖరారు చేయాల్సి ఉందని ఆదేశాల రాయబారులు తెలిపారు. అయితే కశ్మీర్కు కొన్ని ప్రపంచదేశాలకు చెందిన రాయబారులను మాత్రమే తీసుకెళ్లాలని భారత్ భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే సంఖ్యాపరంగా కొన్ని పరిమితులు విధించడంపై విదేశీ రాయబారులు అసంతృప్తితో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇక యూరోపియన్ యూనియన్ దేశాలకు చెందిన రాయబారులకు తగినంత సమయం ఇవ్వకపోవడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. వారు కశ్మీర్లో పర్యటన చేయాలంటే ముందుగా తమ దేశంలోని హెడ్క్వార్టర్స్ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక కశ్మీర్లో పర్యటించే విదేశీ రాయబారులు అక్కడి ప్రజలతో స్వేచ్ఛగా మాట్లాడొచ్చని చెబుతూనే భద్రతాపరమైన పరిధులు మాత్రం దాటరాదని చెబుతున్నారు. కశ్మీర్లో పర్యటించే విదేశీ రాయబారుల బృందం జమ్మూకశ్మీర్లోని పంచాయతీ సభ్యులతో ,ఎన్జీఓలతో సమావేశం అవుతారని సమాచారం. అంతేకాదు శ్రీనగర్లోని సర్పంచ్లకు ఇతర ముఖ్యమైన వారికి ఇప్పటికే విదేశీ రాయబారుల పర్యటనకు సంబంధించి సమాచారం చేరవేశారని తెలిపారు.