తొలిసారి ఓటు వేయబోతున్నవారి సంఖ్య ఎంతో తెలుసా? పేరును చెక్ చేసుకోవడానికి ప్రత్యేక హెల్ప్ లైన్
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి మనదేశ యువత ఆసక్తి చూపుతోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి యువత పెద్ద ఎత్తున తమ పేర్లను నమోదు చేసుకుంది. దేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య 90 కోట్లకు పైమాటే. వారిలో కొత్తగా ఓటును వేయబోతున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటోంది. ఓటరు జాబితాలో తొలిసారిగా వారు తమ పేరును నమోదు చేసుకున్నారు.
18 నుంచి 19 సంవత్సరాల వయస్సున్న యువత 15 లక్షల మందికి పైగా తమ పేరును నమోదు చేసుకోవడం విశేషం. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు. లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సందర్భంగా సునీల్ అరోరా.. ఓటర్ల సంఖ్యను ప్రకటించారు. దేశవ్యాప్తంగా 90 కోట్ల మందికి పైగా తమ ఓటర్లు ఉన్నారని చెప్పారు. వారిలో 18-19 వయస్సున్న వారి సంఖ్య 15 లక్షలకు పైగా ఉందని అన్నారు.
ఓటరు జాబితాలో తమ పేరును చెక్ చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాటు
ఓటరు జాబితాలో తమ పేరు ఉందో? లేదో తనిఖీ చేసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాటును చేసింది. అదే హెల్ప్ లైన్. ఈ హెల్ప్ లైన్ నంబర్ 1950. 24 గంటల పాటు ఈ హెల్ప్ లైన్ అందుబాటులో ఉంటుంది. పోలింగ్ కు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవచ్చని సునీల్ అరోరా తెలిపారు. ఓటర్లు తమ పేరును చెక్ చేసుకోవడంతో పాటు పోలింగ్ కేంద్రాల వివరాలను కూడా కనుక్కోవచ్చని చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవడానికి ఈ ఏర్పాటు చేశామని అన్నారు.