గోవా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక మరో 15 మంది కరోనా రోగులు మృతి
పనాజీ: గోవాలో ఆక్సిజన్ అందక మరణిస్తున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా, గురువారం గురువారం గోవా మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక మరో 15 మంది కరోనా బాధితులు మరణించారు. రెండ్రోజుల క్రితమే ఆక్సిజన్ అందక ఇక్కడ 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతుండటంతపై ఇప్పటికే బాంబే హైకోర్టు గోవా బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్సిజన్ సరఫరాను పెంచి మరిన్ని ప్రాణాలు పోకుండా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా బాధితులు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా దయనీయ పరిస్థితి అని వ్యాఖ్యానించింది. తమను ఎంతో బాధకు గురిచేసిందని పేర్కొంది.
జీఎంసీహెచ్లో ఆక్సిజన్ అందక కరోనా బాధితులు మరణించడంపై దాఖలైన పిటిషన్ల విచారించిన సందర్భంగా ఈ మేరకు కోర్టు స్పందించింది. గోవాకు వెంటనే మెడికల్ ఆక్సిజన్ అందే ఏర్పాట్లు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. కాగా, గోవాలో కరోనా పాజిటివిటీ రేటు అత్యధికంగా ఉండటం గమనార్హం.
మే 12న తాము ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. ఇంకా రాష్ట్రంలో ఆక్సిజన్ అందుబాటులోకి రాలేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గోవా ఆస్పత్రిలో ఇప్పటి వరకు ఆక్సిజన్ అందక సుమారు 40 మంది మరణించినట్లు తమకు సమాచారం అందిందని పేర్కొంది. తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు చీకటి సమయంగా మారుతోందని వ్యాఖ్యానించింది.
అయితే, గోవా అడ్వోకేట్ జనరల్ దేవిదాస్ పంగమ్ మాత్రం రాష్ట్రంలో ఆక్సిజన్ అందక ఎవరూ మరణించడం లేదని కోర్టుకు తెలిపారు. ఇకపై ఆక్సిజన్ అందక రోగులు చనిపోకుండా చూసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఆస్పత్రుల్లో తగినన్నీ ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొంది. శుక్రవారం నుంచి ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ల లభ్యతకు కొరత ఉండదని తెలిపింది. కాగా, పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఆక్సిజన్ సిలిండర్లను ఆస్పత్రులకు అందిస్తున్నాయి.