ఈశాన్య ఢిల్లీ అల్లర్లు: 17,500 పేజీల చార్జీషీట్, 15 మంది పేర్లు.. అనుబంధ చార్జీషీట్ కూడా..
ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు సంబంధించి పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. 17 వేల 500 పేజీల చార్జీషీట్లో 15 మంది పేర్లను ప్రస్తావించారు. అయితే కేసు విచారణ కొనసాగుతోందని.. చార్జీషీట్లో పేరున్నవారికి సంబంధించి అనుబంధంగా కూడా చార్జీషీట్ దాఖలు చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లలో 50 మంది వరకు చనిపోయిన సంగతి తెలిసిందే.
రెండు వాట్సాప్ గ్రూపులు..
చార్జీషీట్లో నమోదుచేసిన వారు అల్లర్లు జరిగేందుకు కారణమయ్యారని పేర్కొన్నారు. రెండు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి.. ఆదేశాలు జారీచేశారని వివరించారు. సీలాంపూర్, జాఫ్రాబాద్లో జరిగిన అల్లర్లు ఇలానే జరిగాయని తెలిపారు. కుట్రదారులు అల్లర్లను ప్లాన్ చేశారని.. దిగువశ్రేణి నేతలు.. ప్రణాళికను అమలు చేసి.. ఘర్షణకు దారితీశారని తెలిపారు.
సీఏఏ అనుకూల, వ్యతిరేకంగా నినాదాలు..
పౌరసత్వ సవరణ చట్టం నేపథ్యంలోనే అల్లర్లు జరిగాయి. సీఏఏకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు నినాదాలు చేయడంతో ఘర్షణ జరిగింది. అది చినికి చినికి గాలివానలా మారింది. జనవరిలో షహీన్ బాగ్ వద్ద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన నేపథ్యంలో పెద్ద ఘటన చేయాలని వీరు భావించారని పోలీసులు చెబుతున్నారు. ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు సంబంధిచి జేఎన్యూ మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
లోతుగా దర్యాప్తు..
ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించి ఏ ఒక్కరీ పాత్రపై లోతుగా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ద్వేషం పెంచి, గొడవకు కారణమైన వారిని గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 24వ తేదీన ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగగా.. ఘర్షణలో 50 మందికి పైగా చనిపోయారు. 108 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఇద్దరు పోలీసులు చనిపోయిన సంగతి తెలిసిందే.