యూపీలో దారుణం: బాలికపై గ్యాంగ్ రేప్, సాయం కోసం అర్థిస్తే.. మళ్లీ మరొకరు..
లక్నో: సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఉదంతమిది. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సాయం కోసం ఆమె అర్థించగా ఆ దారిన వెళుతున్న మరో వ్యక్తి కూడా .. తన కోరిక తీర్చుకుని వెళ్లిపోయాడు.
యూపీ రాజధాని లక్నోకు సమీపంలోని సరోజినీ నగర్ ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ బాలిక(15) ఇంటికి అవసరమైన సరుకులు కొనుక్కునేందుకు బయటికి వెళ్లింది.
ఇది గమనించిన సుమిత్, అతడి స్నేహితుడు వీరేంద్ర ఆమెను అటకాయించి, బలవంతంగా సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడా ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ బాలిక ఆ దారిలో వెళుతున్న శుభమ్ అనే వ్యక్తిని సాయం కోసం అర్థించింది.
అయితే అతడు సాయం చేయకపోగా అదే అదనుగా భావించి తన కోరికను కూడా తీర్చుకుని ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటికే సుమిత్, వీరేంద్రలను అరెస్టు చేసిన వారు శుభమ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.