జీతం అడిగినందుకు .. 12 ముక్కలు చేసి హత్య: ఢిల్లీలో వెలుగుచూసిన ఘోరం
న్యూఢిల్లీ: బతుకుదెరువు కోసం జార్ఖండ్ నుంచి ఢిల్లీ వచ్చిన ఓ 15ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. మూడేళ్లుగా పనిచేస్తున్న సంస్థ నుంచి ఆమెకు ఒక్క రూపాయి జీతం రాకపోగా... దాని గురించి అడిగినందుకు 12ముక్కలు చేసి మరీ ఆమెను అత్యంత కిరాకతంగా హత్య చేశారు.
మృతురాలిని సోనియా కుమారిగా గుర్తించారు. రాంచీ దగ్గరిలోని ఓ గ్రామం నుంచి ఆమె ఢిల్లీకి వచ్చినట్టు పోలీసులు చెప్పారు. రూ.6500 జీతానికి ఓ సంస్థ ఆమెను పనిలో కుదుర్చుకున్నట్టు తెలిపారు. మూడేళ్ల నుంచి అక్కడే ఫుల్ టైమ్ జాబ్ చేస్తున్నా.. జీతం మాత్రం ఒక్క రూపాయి అందలేదన్నారు.
నిజానికి ఆమెకు నెలనెలా జీతం రావాల్సి ఉందని, కానీ ఆమెను ఎవరైతే ఢిల్లీకి తీసుకొచ్చారో... వారే ఆమె జీతాన్ని కాజేశారని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని మంజీత్ కర్కేటాగా గుర్తించారు. అతను మరికొంతమంది కలిసి బాలికను పన్నెండు ముక్కలు చేసి హత్య చేసి.. ఆపై డ్రైనేజీలో పడేసినట్టు చెప్పారు.
జీతం డబ్బులు రాకపోవడంతో ఆ బాలిక మే3న స్వగ్రామంలోని మంజీత్ ఇంటికి వెళ్లి నిలదీసినట్టు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన మంజీత్.. ఆమెను హత్య చేయాలనుకున్నాడు. ఆమె గనుక పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. మూడేళ్ల జీతం డబ్బులు రూ.2లక్షలు ఇవ్వాల్సి వస్తుందని భయపడ్డాడు. అంత డబ్బు ఇచ్చేకంటే ఆమెను హత్య చేయడమే కరెక్ట్ అనుకున్నాడు.
అనుకున్నట్టుగానే మరో ఇద్దరితో కలిసి ఆమెను హత్య చేశాడు. మే 4న డ్రైనేజీలో బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హత్య జరిగినప్పటి నుంచి స్థానిక అపార్ట్మెంట్లో ఉండే మంజీత్ అదృశ్యమైనట్లు గుర్తించారు. మే 17న మంజీత్ తన అద్దె ఇంటికి వచ్చిన సమయంలో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. విచారణలో మంజీత్ నేరం అంగీకరించాడు.