బతికుండగానే భార్యలకు పిండం పెట్టేశారు!: భార్యా బాధితుల సంఘం ఏమేం చేస్తోందంటే..?
వారణాసి: దేశంలో జంతువులను కూడా కాపాడే చట్టాలున్నాయి కానీ.. పురుషులను కాపాడే చట్టాలు లేవంటూ భార్యా బాధితులు వినూత్నంగా నిరసనలు చేపట్టారు. దాదాపు 150 మంది గంగానదీ తీరంలో 'పిశాచ ముక్తి పూజలు' చేశారు. పిశాచాలంటే వారి దృష్టిలో మాజీ భార్యలు.
భార్యలకు.. బతికుండగానే పిండ ప్రదానం
ఆ స్మృతుల నుంచి విముక్తి కోరుతూ, బతికుండగానే వారికి పిండ ప్రదానం చేయడం గమనార్హం. సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ (సిఫ్) పేరిట పూజలు సాగించారు.
‘అలాంటి మహిళలు విషజ్వాలల వంటివాళ్లు. వాళ్ల నుంచి ప్రపంచాన్ని విడిపించాలనే మేమంతా ఇక్కడ గంగాస్నానాలు చేశాం. దేశంలోని పలు ప్రాంతాలవారు మా సంఘంలో ఉన్నారు' అని నిర్వాహకులు వివరించారు.
ముక్కు కోసే ఉత్సవాలు..
సంస్థ పదో వార్షికోత్సవాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నామని, భార్యలు ఎప్పుడూ పురుషుల సొత్తు మాత్రమే కోరతారని చాటుతున్నామన్నారు. ఏటా శూర్పణఖ ముక్కుకోసే ఉత్సవాలనూ చేపడతామని చెప్పారు. ‘భార్యాబాధితులు అందరూ ఇలాగే చేయాలి. అప్పుడే మనసులు తేలికపడతాయి' అని దగ్గరుండి మరీ పూజలు చేయించిన పురుషుల హక్కుల ఉద్యమకారుడు అమిత్ దేశ్పాండే వ్యాఖ్యానించారు.
భార్యా బాధితుడిగా.. సంఘం ఏర్పాటు
‘ఆత్మహత్యలకు పాల్పడిన భార్యాబాధితుల సంఖ్య ఎంతో తెలుసా?...92,000' అని సిఫ్ వ్యవస్థాపక ప్రతినిధి వఖారియా వెల్లడించారు. గృహహింస చట్టం కింద మాజీ భార్య ఆయనపై కేసుపెట్టింది. ఐదు రోజులపాటు జైల్లో ఉన్న ఆయన- బయటకు రాగానే ‘భార్యాబాధితుల సంఘం' ఏర్పాటుచేయాలని నిర్ణయించుకున్నారు. అనిల్ కుమార్, పాండురంగ్ కత్తిలతో కలిసి సిఫ్ను స్థాపించారు.
ఐఐటీయన్లూ సభ్యులే.. 200కేంద్రాలు
భార్యలు కేసులు వేసినప్పుడు భర్తలకు ధైర్యం చెప్పడంతో పాటు న్యాయపరమైన సాయం కల్పిస్తున్నారు. ఐఐటీల్లో చదివినవారూ ఈ సంఘాల్లో సభ్యులుగా చేరారు. సిఫ్కు దేశవ్యాప్తంగా 200 కేంద్రాలున్నాయి. వీటిలో 4000 మందికిపైగా సేవలందిస్తున్నారు.