వాతావరణంలో మార్పుల కారణంగా 2019కి ఒక ప్రత్యేకత ఉంది..ఏంటో తెలుసా..?
న్యూఢిల్లీ: 1901 నుంచి ఇప్పటి వరకు భారత వాతావరణశాఖ గణాంకాల ప్రకారం 2019వ సంవత్సరం అత్యంత వెచ్చని సంవత్సరంగా నమోదైంది. కొంత మేరా ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ 2016తో పోలిస్తే ఇవి తక్కువగానే ఉన్నాయని భారత వాతావరణశాఖ కేంద్రం తెలిపింది. 2019 భారత వాతావరణ శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం 1562 మంది ప్రజలు వాతావరణంలో తలెత్తిన మార్పుల కారణంగా మృతి చెందినట్లు పేర్కొంది. ఇందులో వరదలు, ఎండవేడిమి, తుఫానుల బారిన పడి మృతి చెందినట్లు వెల్లడించింది.
ఎక్కువగా నష్టపోయింది బీహార్ రాష్ట్రం
2019లో వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులకు ఎక్కువగా నష్టపోయిన రాష్ట్రం బీహార్ అని వాతావరణశాఖ చెబుతోంది. భారీ వర్షాలకు వరదలకు, తుఫాన్లకు, వడగాలులకు దాదాపు 650 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదిక వెల్లడిస్తోంది. భారత్లోని సముద్రాలపై 2019లో మొత్తం 8 తుఫాన్లు వచ్చినట్లు ఐఎండీ తెలిపింది. ఇందులో అరేబియన్ సముద్రంపై ఐదు తుఫాన్లు ఏర్పడ్డాయి. సాధారణంగా ఏడాదికి ఒకే తుఫాను వస్తుందని చెప్పిన అధికారులు 1902లో మాత్రమే ఈ స్థాయిలో అరేబియన్ సముద్రంలో తుఫాన్లు ఏర్పడినట్లు వివరించారు. అంతేకాదు 2019లో తుఫాన్లు కూడా చాలా తీవ్రతరంగా మారినట్లు నివేదిక వెల్లడించింది.
వెచ్చదనంలో ఏడో స్థానంలో నిలిచిన 2019వ సంవత్సరం
ఇక వరుసగా రికార్డు అయిన ఐదు వెచ్చనైన సంవత్సరాల వివరాలు ఇలా ఉన్నాయి. 2016లో (0.71 డిగ్రీల సెల్సియస్), 2009లో (0.541 డిగ్రీల సెల్సియస్), 2017లో (0.539 డిగ్రీల సెల్సియస్),2010లో (0.54డిగ్రీల సెల్సియస్) 2015లో (0.42డిగ్రీల సెల్సియస్)గా నమోదైనట్లు నివేదికలో వెల్లడించింది. ఇక భారత్లో సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త ఎక్కువగా నమోదైనట్లు ఐఎండీ పేర్కొంది. 2019లో భూమి ఉపరితల వాతావరణం సగటున 0.36 డిగ్రీల సెల్సియస్గా ఉన్నిందని తెలిపింది. ఇక మొత్తంగా 1901 నుంచి గణాంకాలను పరిశీలిస్తే 2019వ సంవత్సరం వెచ్చదనంలో ఏడో స్థానంలో నిలిచినట్లు ఐఎండీ తెలిపింది.
2019లో అత్యధిక సహజ విపత్తులు
ఇక 2019కి సంబంధించి వార్షిక వర్షపాతం 109శాతంగా ఉన్నిందని నివేదిక వెల్లడించింది. ఇది 1961 నుంచి 2010 వరకు సుదీర్ఘ కాలంకు రికార్డయిన సగటు వర్షపాతం అని పేర్కొంది. ఇక దేశంలో భారీ వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు, చల్లటి గాలులు, మంచు కురవడం, తుఫాన్లు, ఇసుక తుఫాన్లు, మెరుపులు వరదలు లాంటి సహజ విపత్తులు బాగా రికార్డు అయినట్లు నివేదిక తెలిపింది. ఇక భారీ వర్షాలు , వరదలతో దేశవ్యాప్తంగా 850 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.
వడగాలులకు 350 మంది మృతి
ఈశాన్య ప్రాంతాల్లో మధ్యభారతదేశంలో మార్చి నుంచి జూన్ నెల వరకు వీచిన వడగాలులకు 350 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. ఇందులో 293 మంది ఒక్క బీహార్లోనే మృతి చెందారు. మహారాష్ట్రలో వడగాలులకు 44 మంది మృతి చెందారు. ఇక ఉరుములు, మెరుపులు పిడుగులు తుఫాన్ల కారణంగా 380 మంది మరణించినట్లు నివేదిక వెల్లడించింది. ఇందులో జార్ఖండ్లో 125 మంది మృతి చెందగా బీహార్లో 73 మంది, మహారాష్ట్రలో 51 మంది, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో 24 మంది మృతి చెందారు. ఇక మంచుగడ్డలు, కొండచరియలు విరిగి పడి జమ్మూ కశ్మీర్లో 33 మంది ప్రాణాలు కోల్పోగా లేహ్ ప్రాంతంలో 18 మంది మరణించారు. ఇక డిసెంబర్ చివరి వారంలో వీచిన చలిగాలులకు ఉత్తర్ప్రదేశ్లో 28 మంది మృతి చెందినట్లు లెక్కలు వివరిస్తున్నాయి.