కర్నాటక బీజేపీలో ముసలం.. సీఎం కొడుకుపై సంచలన ఆరోపణలు.. 16 మంది ఎమ్మెల్యేల అసమ్మతి
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ సర్కారును కూలగొట్టడంలో బిజీగా ఉన్న బీజేపీకి కర్నాటకలో ఊహించని పరిణామం ఎదురైంది. ఏకంగా 16 మంది ఎమ్మెల్యేలు సీఎం యడ్యూరప్పపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అసమ్మతిరాగం ఆలపించారు. ఆరోగ్య కారణాల వల్ల సీఎం సరిగా పనిచేయకపోతుండటంతో.. ఆయన కొడుకు విజయేంద్ర యడ్యూరప్ప 'సూపర్ సీఎం'గా వ్యవహరిస్తున్నాడని.. కాంట్రాక్టులు, కేటాయింపుల వ్యవహారాల్లో అనుచిత నిర్ణయాలు తీసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నాడని ఎమ్మెల్యేలు ఆరోపించారు.
సీఎం యడ్యూరప్ప కొడుకు విజయేంద్ర అక్రమ వ్యవహారాలను ప్రస్తావిస్తూ శుక్రవారం విడుదలైన లేఖ కర్నాటకలో సంచలనం రేపుతున్నది. ''బీజేపీకి అత్యంత విధేయులైన వ్యక్తులు''పేరుతో విడుదలైన లేఖను.. ఆ 16 ఎమ్మెల్యేలే రాసి ఉంటారని పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు. గతంలోనూ ఇలాంటిదే ఓ లేఖాస్త్రాన్ని వదిలిని అసమ్మతిదారులు.. సీఎం యడ్యూరప్ప ఆరోగ్య పరిస్థితిపై సంచలన అంశాలు ప్రస్తావించారు. తాజా లేఖలోనేమో.. సీఎం ఆరోగ్య కారణాల వల్ల ఆఫీసుకు రాకపోవడంతో ఆయన కొడుకు షాడో సీఎంగా ప్రవర్తిస్తున్న తీరును ఎండగట్టారు.
బెంగళూరులో గురువారం జరిగిన బీజేపీ శాసనసభా పక్షం సమావేశంలోనూ తీరప్రాంత జిల్లాలకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు.. సీఎం ఎదురుగానే అసంతృప్తి వెళ్లగక్కినట్లు వార్తలొచ్చాయి. యడ్డీ పనితీరు బాగోలేదని, పాలనలో ఫ్యామిలీ(కొడుకు) జ్యోక్యం మితిమీరిందని తెగేసి చెప్పడంతో సీఎం కూడా ఘాటుగానే స్పందించారట. 'నియోజకవర్గాల అభివృద్ధి'కి కావాల్సినన్ని నిధులు ఎప్పటికప్పుడు ఇస్తున్నప్పటికీ ఇలాంటి నిందలు వేయడమేంటని సీఎం వాపోయినట్లు తెలుస్తోంది. మొత్తానికి కర్నాటక బీజేపీలో ముసలం ఎటువైపు దారితీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.