ఇళ్లు ఖాళీచేయండి: చిరంజీవి సహా 16మందికి నోటీసులు
న్యూఢిల్లీ: అధికారిక నివాసాలను తక్షణం ఖాళీ చేయాలని మాజీ కేంద్రమంత్రులకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు బుధవారం లోకసభలో ఈ వివరాలు వెల్లడించారు. వీరిలో మన రాష్ట్రానికి చెందిన పళ్లం రాజు, జైపాల్ రెడ్డి, కిల్లి కృపారాణి, బలరాం నాయక్ ఉన్నారు.
మరికొందరు మాజీ మంత్రులు జనరల్ పూల్ బంగాల్లో ఉంటున్నారని, వీరిలో రాజ్యసభ, లోకసభ సభ్యులుగా ఉన్న వారు ప్రస్తుతం కేటాయించిన నివాసాలకు వెళ్లాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ మాజీ మంత్రుల జాబితాలో చిరంజీవి, ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, వీరప్ప మొయిలీ, జైరాం రమేష్, ఆస్కార్ ఫెర్నాండేజ్, రహమాన్ ఖాన్, జ్యోతిరాదిత్య సింధియా, మునియప్ప, రాజీవ్ శుక్లా, శశిథరూర్, ముళ్లపల్లి రామచంద్రన్, కెసి వేణుగోపాల్, అధీర్ రంజన్ చౌదరి, నాచియప్పన్, ఎహెచ్ ఖాన్ చౌదరి, నినాంగ్ ఎర్రింగ్ ఉన్నారు.
మొత్తం 16 మంది తమ బంగళాలను వెంటనే ఖాళీ చేయాలని కేంద్ర పట్టణాభివృద్ది మంత్రిత్వ శాఖ తాఖీదులు పంపింది. అయితే ఈ జాబితాలో జైపాల్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన కొద్దిరోజుల క్రితమే 8, తీస్ జనవరి మార్గ్లోని తన బంగళాను ఖాళీ చేసి హైదరాబాద్ వెళ్లిపోయారట.
ఇళ్లు ఖాళీ చేయని మిగతా మాజీ కేంద్ర మంత్రుల్లో ఫరూక్ అబ్దుల్లా, అజిత్ సింగ్, కపిల్ సిబాల్, బేణీ ప్రసాద్ వర్మ, గిరిజా వ్యాస్, కృష్ణ తీర్థ్, శ్రీకాంత్ జెనా, సచిన్ పైలట్, జితేందర్ సింగ్, ప్రదీప్ జైన్ ఆదిత్య, లాల్ చంద్ కటారియా, మాణిక్ రావ్ గవిట్ ఉన్నట్లు వెంకయ్య బుధవారం లోకసభలో ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు. ఇళ్లు ఖాళీ చేయని మంత్రులు అనధికారికంగా ఉన్నందుకు జూలై 26 వరకు రూ.
20,92,463 చెల్లించాలని ఆయన ఆదేశించారు. కాగా ఇప్పటివరకూ సాధారణ పూల్ బంగళాల్లో ఉన్నమాజీ కేంద్ర మంత్రులు ప్రస్తుతం పార్లమెంట్లో సభ్యులుగా ఉన్నప్పటికీ హోదా మారినందువల్ల తమ హౌజ్ కమిటీలు కేటాయించిన ఇళ్లలోకి మారాలని, అందుకు 15 రోజుల సమయం అదనంగా ఇచ్చామన్నారు. దాదాపు 683 ఫ్లాట్లలో మాజీ ఉద్యోగులు అనధికారికంగా ఉంటున్నారని, వారికి కూడా నోటీసులు వెళ్లాయన్నారు.