రోజుకు 16 గంటల పని, నెలకు రూ.2 వేల వేతనం, మైనర్లతో చాకిరీ, ఢిల్లీ ప్రమాదంలో వెలుగులోకి...
ఢిల్లీలోని అనాజ్ మండీ ఫ్యాక్టరీలో ఆదివారం తెల్లవారు జామున 5.20 గంటలకు జరిగిన ప్రమాదంలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. అక్కడ పనిచేసే కూలీలు, అక్కడే ఉంటూ పనిచేస్తారని ప్రాథమికంగా తెలిసింది. కానీ వారి నుంచి శ్రమ దోపిడీ కూడా చేస్తారనే కఠోర సత్యం బయటపడింది. అంతేకాదు వారికి ఇచ్చే కూలీ ఎంతో తెలిస్తే నోరేళ్లబెట్టడం ఖాయం.
43 మంది మృతి
అనాజ్ మండీ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో 43 మంది కూలీలు విగతజీవులుగా మారారు. ఆ ఐదంతస్తుల భవనంలో అనుమతి తీసుకోకుండా ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారని విచారణలో తేలింది. ఎలాంటి భద్రత చర్యలు తీసుకోకపోవడంతో కార్మికుల నిద్రలోనే అనంతలోకాలకు వెళ్లిపోయారు. చనిపోయిన 43 మందిలో ఏడుగురు మైనర్ బాలురు కూడా ఉన్నారు. నిబంధనల ప్రకారం వారిని ఫ్యాక్టరీ పనుల్లో నియమించుకొవద్దు.
రూ.2 నుంచి రూ.5 వేలు
యాజమాన్యం నిబంధనలకు తుంగలో తొక్కింది. మిగతా కార్మికులకు కూడా తక్కువ మొత్తంలోనే జీతం అందిస్తోంది. మైనర్లు ఫ్యాక్టరీలో ఉంటూ చదువుకుంటున్నారు. అక్కడ లభించిన స్కూల్ బ్యాగుల ఆధారంగా వారిని గుర్తించారు. అయితే వారికి నెలకు ఎంత చెల్లిస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. వారికి నెలకు అక్షరాలా రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు మాత్రమే అందజేస్తున్నారు. వారు అక్కడే ఉంటూ చదువుకొంటూనే పనిచేస్తున్నారు. ప్రమాదంలో గాయపడ్డ ఏడుగురు చిన్నారులు బీహార్కు చెందినవారని పోలీసులు తెలిపారు.
12 నుంచి 16 గంటలు
ఫ్యాక్టరీలో ఉన్న ఇరుకైన గదుల్లో చిన్నారులు నివసించే వారని తెలిసింది. పని స్థలం, ఇళ్లలో రెట్టింపు స్థలాన్ని ఫ్యాక్టరీలో వారి కోసం కుదించి ఇచ్చారని పోలీసుల విచారణలో తెలిసింది. అంతేకాదు వారికి పనిగంటల విషయంలో కూడా కరుణ చూపించలేదు. దాదాపు 12 నుంచి 16 గంటల పాటు పనిచేయిస్తున్నారు. చిన్నారులు మిగతావారితో సమానంగా పనిచేస్తున్న కానీ వారికి మిగతావారితో సగం కన్నా తక్కువ జీతం ఇచ్చారని పోలీసులు తెలిపారు.
ఎలా బయటపడ్డారంటే..
ప్రమాదం నుంచి బయటపడ్డ చిన్నారులు ఫ్యాక్టరీ యాజమాని అతిథి గృహంలో ఉండటం వల్లే తప్పించుకోగలిగారు. తమ జీవన విధానం గురించి పోలీసులకు వారు వివరించడంతో విషయాలు వెలుగుచూశాయి. తాము ఇక్రాం బంధువులమని పదేళ్ల బాలుడు పోలీసులు తెలిపాడు. అగ్నిప్రమాదంలో ఇక్రాం చనిపోయిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఇక్రాం కలిసి తీసుకొచ్చాడని తెలిపారు. కానీ తాను పనిలో చేరలేదని బాలుడు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.