మహారాష్ట్రలో ఘోర ప్రమాదం: ట్రక్కు బోల్తా... 16 మంది కూలీలు మృతి...
మహారాష్ర్టలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జల్గావ్ జిల్లాలోని యావల్ తాలూకా కింగావ్లో ఓ ట్రక్కు బోల్తా కొట్టింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 16 మంది కూలీలు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని... క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వేగంగా వెళ్తున్న ట్రక్కు ఒక్కసారిగా అదుపు తప్పడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులను అభోడా,కెర్హళ,రావెర్ జిల్లాలకు చెందినవారిగా గుర్తించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోనూ ఆదివారం(ఫిబ్రవరి 14) తెల్లవారుజామున ఇదే తరహా ప్రమాద ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.వెల్దుర్తి మండలం మదార్పురం గ్రామ సమీపంలో ఓ మినీ బస్సు బోల్తా కొట్టి... అటుగా వెళ్తున్న లారీని ఢీకొట్టింది. డివైడర్పై ఎక్కిన బస్సు సుమారు 300 అడుగుల వరకూ పల్టీలు కొడుతూ గాల్లో ఎగిరిపడింది. ఇదే క్రమంలో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. అతివేగం,డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మినీ బస్సు పూర్తిగా నుజ్జునుజ్జయింది.
ప్రమాద ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. చెక్కులను తానే స్వయంగా మదనపల్లెకు వెళ్లి బాధిత కుటుంబాలకు అందజేస్తానన్నారు. మదనపల్లెకు చెందిన ఒకే కుటుంబంలో 12 మంది సహా మరో ఇద్దరు మృతిచెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
Maharashtra: 15 people died, two injured after a vehicle overturned near Kingaon village in Yawal taluka of Jalgaon district last night. More details awaited.
— ANI (@ANI) February 15, 2021
Recommended Video
కాగా, చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన నజీరా బేగం (65),ఆమె ముగ్గురు కుమారులు షేక్ దస్తగిరి, షేక్ రఫీ, షేక్ జాఫర్ అలీ కుటుంబ సభ్యులు, నజిరా బేగం కుమార్తె నౌజియా సహా మొత్తం 16 మంది శనివారం రాత్రి 7.30 గంటలకు ఓ మినీ బస్సులో మదనపల్లె నుంచి అజ్మీర్ యాత్రకు బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున 3గంటల సమయంలో బస్సు బెంగళూరు-కర్నూలు జాతీయ రహదారిపై అమకతాడు టోల్ గేటు దాటింది. ఆ తర్వాత కొద్దిసేపటికే వెల్దుర్తి మండలం మదార్పురంలో ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో డ్రైవర్ నజీర్ బస్సు నడుపుతున్నాడు. డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడం,అతివేగంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్దారించారు.