ఘోర రోడ్డు ప్రమాదాలు: 16 మంది వలస కార్మికులు దుర్మరణం: అప్పటి నుంచి రోజూ దుర్ఘటనలే
పాట్నా: లాక్డౌన్ వల్ల స్వస్థలాలకు తిరుగు ప్రయాణమైన వలస కార్మికుల్లో కొందరు తమ గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. మార్గమధ్యలోనే ప్రాణాలను వదలుతున్నారు. ఈ మధ్యకాలంలో రోజుకొక్కటి చొప్పున దేశంలో ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదం సంభవిస్తూనే ఉంది. కొద్దిరోజుల కిందట మహారాష్ట్రలో గూడ్స్ రైలు ఢీ కొని 15 మంది వలస కార్మికులు మరణించడంతో ఆరంభమైన ఈ ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా- వేర్వేరు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో 16 మంది వలస కార్మికులు మరణించారు.
హైకోర్టుకు వంగలపూడి అనిత లేఖ: డాక్టర్ సుధాకర్ అరెస్టుపై సుమోటోగా కేసు: సర్కార్కు ఆదేశాలు
బిహార్లో చోటు చేసుకున్న దుర్ఘటనలో తొమ్మిదిమంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. భాగల్పూర్ జిల్లా నౌగచ్చియా సమీపంలో వలస కార్మికులతో వెళ్తోన్న లారీ ప్రమాదానికి గురైంది. ఎదురుగా వచ్చిన బస్సు లారీని వేగంగా ఢీ కొట్టింది. దాని తీవ్రత స్థాయిలో ఉందంటే.. ఢీ కొట్టిన వెంటనే లారీ అదుపు తప్పింది. రోడ్డు పక్కన ఉన్న గొయ్యిలో పడింది. లారీలోని లోడ్ మొత్తం చెల్లాచెదురైంది.
ఈ ఘటనలో తొమ్మిదిమంది వలస కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరికొందరు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులంతా మహారాష్ట్ర నుంచి స్వస్థలాలకు చేరుకుంటున్న వలస కార్మికులని పోలీసులు చెప్పారు. మహారాష్ట్రలో చోటు చేసుకున్న మరో ఘటనలో నలుగురు వలస కార్మికులు దుర్మరణం పాలయ్యరు. 15 మంది గాయపడ్డారు.
షోలాపూర్ నుంచి జార్ఖండ్కు వలస కార్మికులతో బయలుదేరిన మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు యావత్మల్ వద్ద జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. ఓ టిప్పర్ను వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు వలస కార్మికులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మధ్యప్రదేశ్లోని ఝాన్సీ వద్ద సంభవించిన మరో దుర్ఘటనలో ముగ్గురు కూలీలు మరణించారు. వలస కూలీలతో వెళ్తోన్న ఓ మినీ లారీ ఝాన్సీ-మిర్జాపూర్ జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా 12 మంది గాయపడ్డారు.