50 అడుగుల లోయలోకి పల్టీ కొట్టిన బస్సు!
డెహ్రాడూన్: దేవభూమిగా పేరున్న ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఒకటి సుమారు 50 అడుగుల లోతు ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 25 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.
ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై సుమారు 25 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కర్ణ ప్రయాగ-కాళేశ్వర్ మధ్య అదుపు తప్పింది. ప్రమాదాలను నివారించడానికి రోడ్డు పక్కన నిర్మించిన రెయిలింగ్ను ఢీ కొట్టి లోయలోకి జారింది. పల్టీ కొట్టింది.
ఈ ఘటనలో బస్సు డ్రైవర్, కండక్టర్ సహా 25 మంది గాయపడ్డారు. బస్సు పల్టీ కొట్టిన దృశ్యాన్ని చూసిన వెంటనే ఆ మార్గంలో రాకపోకలు సాగిస్తోన్న వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. లోయ నుంచి క్షతగాత్రులను బయటికి తీసుకొచ్చారు.
వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. హృషికేష్-బద్రీనాథ్ జాతీయ రహదారిపైనే మంగళవారం మరో ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తోన్న ట్యాక్సీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.