చత్తీస్గఢ్ పోలీసుల దాష్టీకం .. 16 మంది యువతులపై అత్యాచారం!
చత్తీస్గఢ్ లో 2015, 2016 సంవత్సరాలలో మొత్తం 16 మంది యువతులపై అక్కడి పోలీసులు అత్యాచారానికి ఒడిగట్టి వారిని దారుణంగా హింసించారని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆరోపించింది.
న్యూఢిల్లీ: ఇంకెవరైనా అత్యాచారానికి పాల్పడితే పోలీసులకు చెప్పుకోవచ్చు... సాక్షాత్తూ మాన ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే మహిళలను చెరబడితే ఎవరికి చెప్పుకోవాలి? చత్తీస్గఢ్ లో అదే జరిగింది.
జాతీయ మీడియా కోడై కూసిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... చత్తీస్గఢ్ లో 2015, 2016 సంవత్సరాలలో మొత్తం 16 మంది యువతులపై అక్కడి పోలీసులు అత్యాచారానికి ఒడిగట్టి వారిని దారుణంగా హింసించారని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆరోపించింది.
దీనికి ప్రభుత్వమే బాధ్యతా వహించాలని, ఈ అఘాయిత్యాలకు ఒడిగట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవడంలో చత్తీస్గఢ్ ప్రభుత్వం విఫలమైందంటూ తాజాగా కమిషన్ నోటీసులు జారీ చేసింది.
పోలీసుల చేతిలో అత్యాచారానికి గురైన 8 మంది యువతులకు రూ.3 లక్షల చొప్పున, లైంగిక వేధింపులకు గురైన 6 మందికి రూ.2 లక్షల చొప్పున, భౌతిక దాడికి గురై బాధపడిన ఇద్దరికి రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ సూచించింది.
తాము 20 మంది బాధితుల వాంగ్మూలం రికార్డు చేయనున్నట్లు కమిషన్ పేర్కొంది. 2015 నవంబర్ లో బీజాపూర్ జిల్లాలోని ఐదు గ్రామాల్లోని మహిళలపై దాదాపు 40 మంది పోలీసులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన వార్త అప్పట్లో సంచలనం సృష్టించింది కూడా.
దీనిపై జాతీయ మీడియాలో వార్తలు వచ్చిన తరువాత జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించి స్వతంత్ర విచారణ జరిపించింది. విచారణలో పోలీసుల తప్పిదం రుజువుకావడంతో కమిషన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.