16 ఏళ్ల కుర్రాడిని స్తంభానికి కట్టేసి పెట్రోల్ పోసి కాల్చేశారు..అదే కారణం
పంజాబ్ : పంజాబ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ స్తంభానికి 16 ఏళ్ల కుర్రాడిని కట్టేసి బతికుండగానే అతనికి నిప్పు పెట్టారు. ఈ విషాదకర ఘటన మన్సాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురుని అరెస్టు చేశారు. ఇక మృతుడు, అతనిపై దాడి చేసిన వ్యక్తి ఇద్దరూ దళిత సామాజిక వర్గానికి చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన శనివారం చోటుచేసుకోగా మృతదేహాన్ని ఆదివారం ఉదయం కనుగొన్నారు.
పంజాబ్లో యువకుడి దారుణ హత్య
పంజాబ్లో యువకుడి హత్య ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. మృతుడు జస్ప్రీత్ సింగ్ను తొలుత ఒక స్తంభానికి తాడుతో కట్టేసి అతనిపై పెట్రోల్ పోసినట్లు చెప్పారు. ఆ తర్వాత నిప్పు పెట్టగా ఆ మంటల్లో జస్ప్రీత్ సజీవదహనం అయ్యాడని చెప్పారు. ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు దుర్మార్గులు జషన్ సింగ్, గుర్జీత్ సింగ్, రాజుసింగ్లను అరెస్టు చేసినట్లు మాన్స ఎస్ఎస్పీ నరేందర్ భార్గవ్ చెప్పారు. ఇక ఘటనకు దారి తీసిన వివరాలను సైతం పోలీసులు వెల్లడించారు.
హత్యకు దారితీసింది ఆ వివాహమేనా..?
రెండున్నరేళ్ల క్రితం మృతుడు జస్ప్రీత్ సోదరుడు కుల్విందర్ సింగ్ జషన్ సోదరి రాజో కౌర్లు ప్రేమించుకున్నారని ఆ తర్వాత ఇద్దరూ ఊరు విడిచి వెళ్లి పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. బుదల్దా ప్రాంతంలో ఇద్దరూ నివాసముంటున్నారు. పెళ్లి తర్వాత వారి తల్లిదండ్రలు ఇంటికి ఒక్కసారి కూడా రాలేదని పోలీసులు చెప్పారు. అంతేకాదు ఇద్దరికీ ఒక కుమారుడు కూడా పుట్టాడని చెప్పారు. జస్ప్రీత్ సింగ్ జషన్ సింగ్ దగ్గర పదేపదే ఈ పెళ్లి ప్రస్తావన తీసుకొస్తూ హేళన చేసేవాడని పోలీసులు చెప్పారు. అంతేకాదు జషన్ సింగ్ సోదరిని వదిలేసి త్వరలోనే తన సోదరుడైన కుల్విందర్ సింగ్ తమతో కలసి ఉండేందుకు వస్తున్నట్లు చెప్పేవాడని పోలీసులు వెల్లడించారు.
జషన్సింగ్ను హేళన చేసిన మృతుడు
పదేపదే జషన్సింగ్ను జస్ప్రీత్ హేళన చేస్తుండటంతోనే ఆగ్రహం చెంది అతన్ని హత్య చేసి ఉంటారని పోలీసులు చెప్పారు. ఇదిలా ఉంటే శుక్రవారం రోజున జషన్ సింగ్, అతని బంధువు గుర్జీత్ సింగ్, మరో మిత్రుడు రాజులు తమ ఇంటికి వచ్చి జస్ప్రీత్ను ఎక్కడికో తీసుకెళ్లారని జస్ప్రీత్ తండ్రి చెప్పాడు. జస్ప్రీత్ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. అయితే అతనికోసం గాలించగా.. జస్ప్రీత్ శవం ఓ గోడౌన్లో దొరికినట్లు వెల్లడించారు.
ఎస్సీ కమిషన్ ఏం చెప్పిందంటే..?
ఇక ఘటనపై స్పందించారు పంజాబ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చీఫ్ తేజిందర్ కౌర్. దళితులపై ఇతర కులాల వారు దాడి చేస్తే కేసును పరిగణిస్తామని అయితే దళితులపై దళితులే దాడి చేయడాన్ని తాము టేకప్ చేయమని చెప్పారు. కానీ ముమ్మాటికీ ఇది దారుణమైన హత్యే అని చెప్పిన తేజిందర్ కౌర్... నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.