అనుమానం: పేరెంట్స్ ముందే బాలికను కాల్చి చంపారు
డిస్పూర్: అస్సోం రాష్ట్రంలో దారుణం జరిగింది. పదహారేళ్ల ఓ యువతిని మిలిటెంట్లు ఇంట్లో నుండి బయటకు లాక్కొచ్చి కొట్టి, తల్లిదండ్రుల ముందే తుపాకీతో తొమ్మిదిసార్లు కాల్చి చంపారు. ఈ విషాధ సంఘటన అస్సాంలోని చిరంగ్ జిల్లాలో చోటు చేసుకుంది.
మృతి చెందిన అమ్మాయిని మిలిటెంట్లు పోలీస్ ఇన్ఫార్మర్గా అనుమానించారు. నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ మిలిటెంట్లు ఈ దారుణానికి ఒడిగట్టారు.
చిరంగ్ జిల్లాలోని ఇండో - భూటాన్ సరిహద్దులో ద్విముగ్రి గ్రామంలో ప్రియ అనే అమ్మాయిని పట్టపగలే తల్లిదండ్రుల కళ్లముందే దారుణంగా కాల్చి చంపేశారు. ఆమె మృతదేహం గ్రామం వద్ద పొలాల్లో పడి ఉన్నా తల్లిదండ్రులు భయంతో రెండు రోజుల వరకు తీసుకోలేదు.
ఈ సంఘటన ఈ నెల 21వ తేదీన జరిగింది. మృతదేహాన్ని ఇరవై నాలుగు గంటల అనంతరం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, అస్సాం ప్రభుత్వ అధికార ప్రతినిధి, పరిశ్రమల శాఖ మంత్రి మాట్లాడుతూ.. దీని పైన విచారణకు ఆదేశిస్తామని తెలిపారు. బాలిక కుటుంబ సభ్యులకు ప్రభుత్వం రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది.